
గువాహటి వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. 7 వికెట్ల నష్టానికి టీమిండియా 373 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక టార్గెట్ 374 గా ఉంది.
ఓపెనర్లు శుభారంభం
ముందుగా టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(83), శుభ్మన్ గిల్ (70) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తొలి వికెట్కు 143 పరుగుల భాగస్వామ్యానికి నెలకొల్పారు. 19 ఓవర్లో వీరి జోడీకి తెరపడింది. డాసున్ శనక బౌలింగ్లో గిల్ ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తరువాత కోహ్లీతో కలిసి దూకుడుగా ఆడిన రోహిత్ 83 పరుగులు వద్ద ఔటై సెంచరీ మిస్ అయ్యాడు.
కోహ్లీ వీరవిహారం
ఈ మ్యాచ్ లో కోహ్లీ వీరవిహారం చేశాడు. 87 బంతుల్లో 113 పరుగులు చేసి రజత బౌలింగ్ లో కుశాల్ మెండిస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇందులో 10 ఫోర్లు, ఓ సిక్స్ ఉంది. వన్డేల్లో అతడికిది 45వ సెంచరీ కాగా.. శ్రీలంకపై తొమ్మిదోది కావడం విశేషం. ఇక రాహుల్ 39, శ్రేయస్ అయ్యర్ 28, పాండ్య 14, అక్షర్ 9 పరగులు చేశారు. లంక బౌలర్లలో రజత మూడు వికెట్లు తీశాడు.