 
                                    - మ. 1.45 నుంచి స్టార్ స్పోర్ట్స్లో లైవ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్కు ఇండియా టీమ్ రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా సూర్యకుమార్ సేన బరిలోకి దిగుతోంది. అయితే తొలి మ్యాచ్ మాదిరిగానే ఈ పోరుకూ వాన గండం పొంచి ఉందని వాతావరణ నివేదిక. కాసేపు దీనిని పక్కనబెడితే తొలి మ్యాచ్లో కెప్టెన్ సూర్య గాడిలో పడటంతో టీమిండియా బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. ఒకవేళ రెండో టీ20 పూర్తిగా జరిగితే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య, గిల్ ధనాధన్ బ్యాటింగ్తో రెచ్చిపోవడం ఖాయం.
హాజిల్వుడ్ బౌలింగ్లో 125 మీటర్ల దూరం కొట్టిన సిక్స్ను మరోసారి రిపీట్ చేయాలని సూర్య యోచిస్తున్నాడు. ఆల్రౌండర్ శివం దూబే కూడా బ్యాట్కు పని చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. బ్యాటర్లందరూ చెలరేగి 250, 260 స్కోర్లు చేయాలని కోచ్ గంభీర్ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించాడు. కొన్నిసార్లు 120, 130కి ఆలౌటైనా దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. దాంతో రాబోయే వరల్డ్ కప్లో భారీ స్కోర్లు నమోదు చేసేందుకు ఇప్పట్నించే కసరత్తులు మొదలుపెట్టాడు. బౌలింగ్లోనూ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
అయితే చిన్న స్కోర్లను కూడా కాపాడాలన్న ఏకైక టార్గెట్ను గౌతీ వీళ్ల ముందుంచాడు. దీన్ని వీళ్లు ఎలా అధిగమిస్తారో చూడాలి. మరోవైపు ఆసీస్ బిగ్ హిటర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, స్టోయినిస్, టిమ్ డేవిస్, జోస్ ఇంగ్లిస్పై ప్రధానంగా బ్యాటింగ్ ఆధారపడి ఉంది. లక్ష్యాన్ని నిర్దేశించడంలోనైనా, ఛేదించడంలోనైనా కంగారూలు చాలా భిన్నంగా ఆడతారు.
కాబట్టి వీళ్లను కట్టడి చేయాలంటే ఇండియా పేస్–స్పిన్ కలిసి సంయుక్తంగా పోరాడాలి. స్టార్క్ లేకపోవడం, కమిన్స్ గాయంతో ఈ సిరీస్కు దూరం కావడంతో కంగారూల బౌలింగ్లో కాస్త పదును లోపించింది. బార్ట్లెట్, ఎలిస్, కునెమన్ను నడిపించాల్సిన అతిపెద్ద బాధ్యత హాజిల్వుడ్పై ఉంది.

 
         
                     
                     
                    