బంగ్లాదేశ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 133/8

బంగ్లాదేశ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 133/8

చట్టోగ్రామ్‌‌‌‌: బంగ్లాదేశ్‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌పై ఇండియా పట్టు బిగించింది. లెఫ్టార్మ్‌‌ రిస్ట్‌‌ స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌ (40, 4/33) ఆల్‌‌రౌండ్‌‌ షోకు తోడుగా హైదరాబాదీ పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌ (3/14) మెరుపులు మెరిపించడంతో.. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 44 ఓవర్లలో 133/8 స్కోరు చేసింది. మెహిదీ హసన్‌‌ (16  బ్యాటింగ్‌‌), ఎబాదత్‌‌ హుస్సేన్‌‌ (13 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 278/6 స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 133.5 ఓవర్లలో 404 రన్స్‌‌కు ఆలౌటైంది. శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (86) ఔటైనా, అశ్విన్‌‌ (58) హాఫ్‌‌ సెంచరీతో సత్తా చాటాడు. 22 నెలల తర్వాత టెస్ట్‌‌ మ్యాచ్‌‌ ఆడుతున్న స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌..అశ్విన్‌‌తో కలిసి ఎనిమిదో వికెట్‌‌కు 92 రన్స్‌‌ జోడించాడు. తైజుల్‌‌ ఇస్లామ్‌‌, మెహిదీ హసన్‌‌ చెరో నాలుగు వికెట్లు తీశారు.  ప్రస్తుతం 271 రన్స్‌‌ వెనుకబడి ఉన్న బంగ్లా ఫాలో ఆన్‌‌ తప్పించుకోవాలంటే 72 రన్స్‌‌ చేయాల్సి ఉంది.  

సిరాజ్​, కుల్దీప్‌‌ కేక

ఫ్లాట్‌‌ వికెట్‌‌పై సిరాజ్‌‌ బాల్‌‌ను రెండు వైపుల స్వింగ్‌‌ చేస్తూ బంగ్లా ‘టాప్‌‌ ఆర్డర్‌‌’ను పేకమేడలా కూల్చాడు. ఇన్నింగ్‌‌ తొలి బాల్‌‌కు నజ్ముల్‌‌ హుస్సేన్‌‌ (0), తర్వాత లిటన్‌‌ దాస్‌‌ (24), జాకీర్‌‌ హుస్సేన్‌‌ (20)ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. మధ్యలో యాసిర్‌‌ అలీ (4)ని ఉమేశ్‌‌ (1/33) పెవిలియన్‌‌కు పంపడంతో బంగ్లా 56 రన్స్‌‌కే 4 వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌‌ను కుల్దీప్‌‌ పూర్తిగా కంట్రోల్‌‌ చేశాడు. బంతిని ఎక్కువ టర్న్‌‌ చేయకపోయినా.. స్క్వేర్‌‌ స్పిన్‌‌తో ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌ రాబట్టాడు. ఫలితంగా 10 ఓవర్లలో 3 మెయిడెన్స్‌‌ వేసి..  షకీబ్‌‌ (3), నురుల్‌‌ హసన్‌‌ (16),  ముష్ఫికర్‌‌ (28), తైజుల్‌‌ ఇస్లామ్‌‌ (0)లను ఔట్‌‌ చేశాడు. దీంతో 46 రన్స్‌‌కే ఈ నాలుగు వికెట్లు పడటంతో బంగ్లా తక్కువ స్కోరుకే రోజును ముగించింది.