WTC Points Table: సౌతాఫ్రికాపై వైట్ వాష్.. పాకిస్థాన్, శ్రీలంక కంటే వెనక పడిన టీమిండియా

WTC Points Table: సౌతాఫ్రికాపై వైట్ వాష్.. పాకిస్థాన్, శ్రీలంక కంటే వెనక పడిన టీమిండియా

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా ఐదో స్థానికి పడిపోయింది. బుధవారం (నవంబర్ 26)  గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఘోర ఓటమి తర్వాత నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా ఐదో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ముందు మూడో స్థానంలో ఉన్న భారత జట్టు రెండు టెస్టులు ఓడిపోయి క్లీన్ స్వీప్ కావడం వలన రెండు స్థానాలు దిగజారి ఐదో ర్యాంక్ తో సరిపెట్టుకుంది. ఇండియా (48.15) పాయింట్ల శాతం 50 శాతం కంటే తక్కువగా ఉంది. టీమిండియా ఓటమి పాకిస్థాన్ కు కలిసొచ్చింది. ఇండియా ఐదో స్థానానికి పడిపోవడంతో పాకిస్థాన్ నాలుగో స్థానానికి చేరుకుంది.

ఇండియాను క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా రెండో స్థానికి చేరుకుంది. తొలి టెస్టుకు ముందు నాలుగో స్థానంలో ఉన్న సఫారీలు టీమిండియాపై 2-0తో విజయం సాధించడంతో 75 శాతం పాయింట్ల శాతంతో టాప్-2కు దూసుకెళ్లారు. వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా జూలై నెలలో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో విజయం సాధించిన తర్వాత.. ఇటీవలే యాషెస్ లో తొలి టెస్ట్ గెలుపుతో  100 శాతం విజయాలతో  అగ్రస్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఆరు, బంగ్లాదేశ్ ఏడో స్థానంలో నిలిచాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో 5 టెస్టు మ్యాచ్ లాడిన విండీస్ జట్టు ఐదు మ్యాచ్ ల్లోనూ ఘోరంగా ఓడిపోయింది. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకొని మూడో స్థానంలో నిలిచిన టీమిండియా.. ఆ తర్వాత వెస్టిండీస్ పై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి మూడో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. విండీస్ పై రెండో టెస్టులో విజయం తర్వాత పాయింట్ల శాతం (PCT) 55.56 నుండి 61.90కి పెరిగింది. సౌతాఫ్రికాపై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ కావడంతో ఐదో స్థానానికి పడిపోయింది. ఇండియా ఇప్పటివరకు డబ్ల్యూటీసిలో 9 టెస్ట్ మ్యాచ్ లాడింది. వీటిలో నాలుగు గెలిచి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 48.15 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.