- రెండో టెస్ట్లోనూ సౌతాఫ్రికా గ్రాండ్ విక్టరీ
- 408 రన్స్ తేడాతో ఓడిన టీమిండియా
- 2–0తో సిరీస్ సఫారీల సొంతం
గువాహటి: స్వదేశంలో టీమిండియా రెండోసారి వైట్వాష్కు గురైంది. భారీ లక్ష్య ఛేదనలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో.. సౌతాఫ్రికాతో బుధవారం ముగిసిన రెండో టెస్ట్లోనూ ఇండియా 408 రన్స్ భారీ తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సఫారీ జట్టు 2–0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. రన్స్ పరంగా టీమిండియాకు అతిపెద్ద ఓటమి కాగా, 25 ఏళ్ల తర్వాత ఇండియాలో సౌతాఫ్రికన్లు తొలిసారి సిరీస్ విజయాన్ని అందుకోవడం విశేషం. ఓవరాల్గా 13 నెలల వ్యవధిలో స్వదేశంలో ఇండియా వైట్వాష్కు గురికావడం ఇది రెండోసారి. ఇంతకుముందు న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడింది. 549 రన్స్ ఛేదనలో 27/2 ఓవర్నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 140 రన్స్కే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. మర్కో యాన్సెన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్లో మొత్తం 17 వికెట్లు తీసిన సిమోన్ హార్మర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇండియా ఆడిన 18 టెస్ట్ల్లో పదింటిలో ఓడింది.
హార్మర్ సిక్సర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమని తెలిసినా.. ఇండియా బ్యాటర్లు కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదు. ఇండియా బౌలర్లకు రోడ్లాగా కనిపించిన పిచ్పై ఆఫ్ స్పిన్నర్ సిమోన్ హార్మర్ (6/37) బంతిని బొంగరంలా గింగరాలు తిప్పాడు. దాంతో కనీసం ఒక్కరు కూడా ఓపికను చూపెట్టలేకపోయిన ఇండియన్ స్టార్లు పెవిలియన్కు క్యూ కట్టారు. స్టార్టింగ్లో ఓవర్నైట్ బ్యాటర్లు కుల్దీప్ యాదవ్ (5), సుదర్శన్ (14) డిఫెన్స్కు ప్రాధాన్యత ఇచ్చినా ఒత్తిడిని జయించలేకపోయారు. ముఖ్యంగా సుదర్శన్ 139 బాల్స్ను ఎదుర్కొన్నా ఆరుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ప్రతి డెలివరీకి ఔటయ్యేలా కనిపించాడు. చివరకు 24వ ఓవర్లో హార్మర్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగు బాల్స్ తేడాలో కుల్దీప్, ధ్రువ్ జురెల్ (2)ను పెవిలియన్కు పంపాడు. దాంతో ఇండియా 90/5తో టీ బ్రేక్కు వెళ్లింది. బ్రేక్ తర్వాత ఏడో ఓవర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (13)ని ఔట్ చేసి హార్మర్ మ్యాచ్ను తమవైపు లాగేసుకున్నాడు. ఈ దశలో జడేజా ఒంటరిపోరాటం చేశాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన సుదర్శన్ను ముత్తుసామి (1/21) ఫుల్ టాస్ బాల్తో బోల్తా కొట్టించాడు. ఈ టైమ్లో హార్మర్ మరోసారి విజృంభించాడు. తన వరుస ఓవర్లలో సుందర్ (16), నితీశ్ కుమార్ (0)ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో జడేజా 78 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 64వ ఓవర్లో కేశవ్ మహారాజ్ (2/37) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఐదు బాల్స్ వ్యవధిలో జడేజా, సిరాజ్ (0)ను ఔట్ చేసి ప్రొటీస్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489, ఇండియా తొలి ఇన్నింగ్స్: 201, సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్డ్, ఇండియా రెండో ఇన్నింగ్స్: 63.5 ఓవర్లలో 140 ఆలౌట్ (జడేజా 54, సుందర్ 16, హార్మర్ 6/37).
డబ్ల్యూటీసీ ర్యాంకు కిందకు
సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ల సిరీస్లో ఓడిన టీమిండియా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగ్స్లోనూ ఘోరంగా పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఇండియా 9 టెస్ట్లు ఆడగా నాలుగింటిలో గెలిచింది. నాలుగింటిలో ఓడింది. ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది. 48.15 పీసీటీతో ఐదో ప్లేస్లో కొనసాగుతోంది. ఫలితంగా ఫైనల్ చేరే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. వచ్చే ఏడాది ఆగస్ట్లో శ్రీలంకతో రెండు మ్యాచ్ల సిరీస్, అక్టోబర్–నవంబర్లో న్యూజిలాండ్తో ఓ సిరీస్ ఉంటుంది. ఇందులో మెరుగైన ఫలితాలు రాబడితే అప్పుడు ఏమైనా చాన్స్ ఉంటుందేమో చూడాలి. తాజా ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా (100), సౌతాఫ్రికా (75), శ్రీలంక (66.67), పాకిస్తాన్ (50) వరుసగా టాప్–4లో ఉన్నాయి. కివీస్ ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. టాప్–2లో నిలిచిన జట్లు 2027లో జరిగే ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
