
- రూ.76 వేల కోట్ల ఫండ్స్లో రూ.63 వేల కోట్లను ప్లాంట్ల ఏర్పాటుకు కేటాయింపు
- సెమికండక్టర్ ల్యాబ్ కోసం రూ.10 వేల కోట్లు
- రూ. వెయ్యి కోట్లతో చిప్ డిజైన్ స్కీమ్.. అమల్లో 10 ప్రాజెక్టులు..
- డీఎల్ఐ స్కీమ్ కింద 23 కంపెనీలకు ఆమోదం : మైటీ సెక్రెటరీ కృష్ణన్
న్యూఢిల్లీ: ఇండియాలో సెమికండక్టర్ సెక్టార్ వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ చర్యలతో చిప్ తయారీలోకి పెద్ద కంపెనీలు ఎంటర్ అవుతున్నాయి. సెమికాన్ 1.0 పథకం ద్వారా తయారైన మొదటి చిప్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్కీమ్ సక్సెస్ అవ్వడంతో సెమికాన్ 2.0 ని కూడా తీసుకురావాలని కేంద్రం చూస్తోంది. సెమికాన్ 1.0 కింద రూ.76 వేల కోట్లను కేటాయించారు. ఇందులో మిగిలిపోయిన ఫండ్స్ను ఉపయోగించి మరో రెండు లేదా మూడు చిన్న చిప్ ప్రాజెక్టులను ఆమోదించాలని ప్రభుత్వం చూస్తోంది.
సెమికాన్ 1.0 స్కీమ్ నిధులు మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) సెక్రెటరీ ఎస్. కృష్ణన్ అన్నారు. “ఇప్పటికే రూ.63 వేల కోట్ల వరకు ఫ్యాబ్స్ కోసం కేంద్రం ఖర్చు చేసింది. మిగిలిన నిధులతో రెండు లేదా మూడు చిన్న ప్రాజెక్టులకు మాత్రమే ఆర్థిక సాయం చేయగలం. దీంతో సెమికాన్ 1.0 ముగుస్తుంది. సెమికాన్ 2.0 పథకం రూపకల్పనలో ఉన్నాం. దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రంలోని ఇతర మంత్రిత్వ శాఖలతో చర్చలు జరుగుతున్నాయి” అని ఆయన తెలిపారు.
సెమికాన్ 1.0 కింద రూ.63 వేల కోట్లను చిప్ల తయారు చేసే ఫ్యాబ్స్ కోసం, రూ.10 వేల కోట్లను మొహాలీలోని సెమికండక్టర్ ల్యాబ్ కోసం, రూ.వెయ్యి కోట్లను డిజైన్-లింక్డ్ ఇన్సెంటివ్ (డీఎల్ఐ) స్కీమ్ కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటివరకు 10 ప్రాజెక్టులను ఆమోదించింది. ఇవి వివిధ దశల్లో అమలులో ఉన్నాయి. “ఈ ఏడాది చివరికి, భారత్లో తయారైన మొదటి కమర్షియల్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని అని కృష్ణన్ అన్నారు.
సెప్టెంబర్ 2న సెమికాన్ ఇండియా
సెమికండక్టర్ సెక్టార్ విస్తరించడంలో స్టార్టప్లు, విద్యా సంస్థలు కీలకంగా నిలిచాయి. “ఈ రంగంలోని స్టార్టప్లు ప్రధానంగా చిప్ డిజైన్లో పనిచేస్తున్నాయి. డీఎల్ఐ స్కీమ్కు 23 స్టార్టప్లు ఇప్పటికే అర్హత పొందాయి” అని కృష్టన్ తెలిపారు. మైటీ తీసుకొచ్చిన చిప్స్ టు స్టార్టప్స్ కార్యక్రమం ద్వారా 280 విద్యా సంస్థలు, 72 స్టార్టప్లు అధునాతన డిజైన్ టూల్స్ను ఉపయోగిస్తున్నాయి.
ఈ స్కీమ్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు, విస్తృతంగా కంపెనీలు ఉపయోగించగలిగేలా, రిస్క్ క్యాపిటల్ అందుబాటులో ఉండేలా మెరుగుపరచనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2న ఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2025 కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఈ ఈవెంట్ జరగనుంది. “ఈసారి 33 దేశాల ప్రతినిధులు, 50 చీఫ్ ఎక్స్పీరియెన్స్ ఆఫీసర్స్(సీఎక్స్ఓలు) , 350 ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
గత ఏడాది ఇది 200 కంటే తక్కువగా ఉంది. ఈసారి ఆరు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి” అని కృష్ణన్ వివరించారు. అంతర్జాతీయ టారిఫ్లు, జియోపాలిటికల్ సప్లయ్ చైన్ ఒత్తిడులపై ప్రశ్నించగా, “ఎలక్ట్రానిక్స్కు సంబంధించి ఇండియాపై ఇంకా టారిఫ్లు పడడం లేదు. ఇప్పటికే పెట్టుబడులు చేసిన కంపెనీలు తమ ప్లాన్స్కు పెద్దగా అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయి.
టెక్నాలజీ ఒకే దేశం నుంచి రావడం లేదు. మనం విభిన్న దేశాల నుంచి టెక్నాలజీని పొందుతున్నాం. చిన్న సమస్యలు ఉండొచ్చు. కానీ, సెమికాన్ మిషన్, పీఎల్ఐ పథకాలు, కొత్త ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీ పథకంపై దీని ప్రభావం ఉండదని భావిస్తున్నాం” అని కృష్ణన్ స్పష్టం చేశారు. సెమికాన్ 2.0 తో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.