
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి 390 పరుగులు చేసింది. శ్రీలంకకు 391 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించడంతో టీమిండియా మూడెంకల స్కోరు చేసింది. లంక బౌలర్లకు భారత్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానం నలుమూలల బౌండరీల వరద పారించారు. ఓపెనర్ శుభ్మన్ గిల్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో రెండో సెంచరీ సాధించాడు. ఆఖరి వన్డేలో చెలరేగి ఆడిన గిల్ ఈ ఫీట్ ని అందుకున్నాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచి దాటిగా ఆడుతూ 89 బంతుల్లో 100 రన్స్ (13 ఫోర్లు, 2 సిక్స్ లు) చేశాడు. అయితే, గిల్కు వన్డేల్లో ఇదే రెండో శతకం. రోహిత్ శర్మ (42), శ్రేయస్ అయ్యర్ (38) రాణించారు. లంక బౌలర్లలో లహిరు కుమార, కసున్ రజిత తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నె ఒక వికెట్ తీశాడు.
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నుంచి పరుగుల వరద పారింది. స్పిన్,ఫాస్ట్ అనే తేడా లేకుండా లంక బౌలర్లపై కనికరం చూపించకుండా అందరినీ చితకబాదాడు. 85 బంతుల్లో సెంచరీ చేసిన విరాట్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 20 బంతుల్లోనే అర్థశతకాన్ని పూర్తి చేశాడు. 110 బంతుల్లో విరాట్ 166 పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 7 సిక్స్ లు ఉన్నాయి. కోహ్లీ బౌండరీ లైన్ కు బంతిని తరలించినప్పుడల్లా మైదానంలోని అభిమానులు కేరింతలు పెట్టారు. విరాట్..విరాట్ అంటూ నినాదాలు చేశారు.
బ్యాటింగ్ కు వచ్చినప్పటి నుంచి లంక బౌలర్లపై ఎటాకింగ్ కు దిగాడు విరాట్ కోహ్లీ. 85 బంతుల్లో సెంచరీ మార్క్ ను చేరుకున్నాడు. వన్డేల్లే కోహ్లీకి ఇది 46వ సెంచరీ కాగా..ఓవరాల్ గా 74 సెంచరీలు పూర్తి చేశాడు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయి అధిగమించాడు. వన్డేల్లో శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దనే రికార్డును బ్రేక్ చేశాడు. జయవర్దనే 418 ఇన్నింగ్స్ల్లో 12,650 రన్స్ చేశాడు. కోహ్లీ 267 ఇన్నింగ్స్ల్లోనే 12,651 రన్స్ స్కోర్ చేశాడు. దాంతో వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగుల చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. . ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 18,426 రన్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కుమార సంగక్కర (శ్రీలంక – 14,234), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా – 13,704), సనత్ జయసూర్య (శ్రీలంక – 13,430) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.