
ఇండియన్ సినిమా.. ఇపుడు గ్లోబల్ స్థాయికి చేరింది. అందుకు తగ్గట్టుగానే కథలు రెడీ చేస్తున్నారు మన దర్శకులు. ఇందులో భాగంగా కథ నచ్చితే, దర్శకుడి విజన్పై నమ్మకం ఉంటే.. ఎలాంటి రిస్క్ చేయడానికైనా నిర్మాతలు వెనక్కి తగ్గట్లేదు. కథకు తగ్గట్టుగా క్యాస్టూమ్స్, లొకేషన్స్, సెట్స్.. ఇలా ప్రతిదీ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు. మూడేళ్ల ముందువరకు భారతీయ సినిమాలన్నీ.. సెట్స్ నిర్మించాలంటే.. VFX మరియు CGI లపై ఆధారపడటం చూస్తూ వచ్చాం. కానీ, ఇది పాత పద్ధతి. ఇప్పుడు దర్శకులే దగ్గరుండి తమకు నచ్చినట్టుగా.. ఆర్ట్ డైరెక్టర్స్ తో సెట్స్ నిర్మించుకుంటున్నారు. అయితే, టెక్నాలజీ ఉపయోగించి భారీ సెట్లను నిర్మించే పాత పద్ధతి పూర్తిగా పోనప్పటికీ.. మెల్ల మెల్లగా పోతుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం మన భారతీయ దర్శకులు తమ కొత్త చిత్రాల కోసం సాహసం చేస్తున్నారు. దర్శకుల సాహసానికి చిత్రనిర్మాతలు బలమవుతున్నారు. ఇందుకోసం దర్శకుల విజనరీకి దగ్గరగా భారీ బడ్జెట్ తో భారీ సెట్లను నిర్మిస్తున్నారు. మరి లేటెస్ట్గా ఓ దిగ్గజ దర్శకుడు తన సినిమా కోసం రూ.50 కోట్ల బడ్జెట్తో సెట్ నిర్మిస్తున్నాడు. ఇది ఒక పెద్ద నగర పరిమాణాన్ని చూపించేలా ఉండబోతుంది. అంతేకాదు.. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ఖర్చుతో నిర్మిస్తున్న సెట్ కావడం విశేషం. మరి ఆ సెట్ వివరాలేంటీ? ఆ దర్శకుడు ఎవరు? ఇంతటి భారీ బడ్జెట్ పెడుతున్న నిర్మాత ఎవరు? ఆ సినిమా పూర్తి వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్తో భారీ సెట్:
రాజమౌళి, మహేష్ బాబు కలయికలో SSMB 29 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ కీలక ఘట్టం వారణాసిలో జరుగబోతుంది. ఇందుకోసం రాజమౌళి.. హైదరాబాద్ నగరంలోనే ఘాట్లు మరియు దేవాలయాలతో మొత్తం కాశీ నగరాన్ని పునఃసృష్టించబోతున్నాడు. రియల్ లొకేషన్ లో షూట్ చేయడం కష్టం కాబట్టి.. రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి నగరాన్ని నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే, సెట్ వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. ఈ సెట్ ఖర్చు దాదాపు రూ.50 కోట్లు. అంటే, ఇది భారతీయ సినిమా చరిత్రలో ఒకే సెట్కు కేటాయించడంలో ఇదే అత్యధికం. అందుకే సెట్ విషయంలో జక్కన్నఅండ్ తన టీమ్.. ప్రతి కొలతను పక్కాగా తీసుకుని మరి నిర్మిస్తున్నారు. సెట్ విషయంలో రాజమౌళి అసలు కాంప్రమైజ్ కారు. ఈ విషయం బాహుబలి, RRRతోనే నిరూపితం అయ్యింది. ఇప్పుడు SSMB 29తో కాశీ నగరం అంటే.. ఇక ఊరుకుంటాడా? ఎక్కడ రాజీపడేదేలే అన్నట్టుగా నిర్మిస్తున్నాడు. గతే కొన్నేళ్లుగా ఈ భారీ సెట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SSRMB LEAKED SET PIC
— Kilim Durgarao (@DurgaraoKilim) March 5, 2025
SS Rajamouli is recreating Kashi in Hyderabad. Shoot on this set will begin once Odisha schedule is completed!!#SSMB29 #MaheshBabu #SSRajamouli pic.twitter.com/XTZvfJfBH7
ఇతర అత్యంత ఖరీదైన సెట్లు:
మరో తెలుగు పాన్-ఇండియా మూవీ, ప్రభాస్ ది రాజాసాబ్ లో కూడా ఒక అద్భుతమైన సెట్ను క్రియేట్ చేశారు మేకర్స్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ గా నిర్మించారు. 38000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెట్ను రూపొందించడానికి 6 నెలలు పట్టింది. కానీ దాని ఖర్చు ఎంతనేది మాత్రం ఇంకా బయటకి రాలేదు.
2002లో దేవదాస్లోని చంద్రముఖి కోట కోసం రూ.12 కోట్లు. అదేవిధంగా, బాజీరావ్ మస్తానీ, హీరామండి, బాహుబలి, ప్రేమ్ రతన్ ధన్ పాయో మరియు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్..ఇలా పలు పెద్ద సినిమాల సెట్లకు రూ.15-20 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఇప్పుడు జక్కన్న తన ఐడియాలజీకి తగ్గట్టుగా ఏకంగా రూ.50 కోట్లు పెట్టడం.. అందరీని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
SSMB29:
ఈ భారీ బడ్జెట్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాకు రామాయణ సంబంధం ఉంది. మహేష్ బాబు పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన జాదీ బుటి (ఔషధ మూలికలు, మూలాలు) కోసం వేట సాగించే దిశగా సాగుతుందని టాక్. ఇందులో మహేష్ క్యారెక్టర్కు హనుమంతునికి సమానమైన లక్షణాలు ఉంటాయని, అడవిలో అన్ని అసమానతలతో పోరాడిన చరిత్రను కలిగి ఉంటాడని తెలుస్తోంది.
SSMB29 మూవీని కె ఎల్ నారాయణ దుర్గ ఆర్ట్స్ బ్యానర్పై సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిన్నే ఇష్టపడ్డాను, హలో బ్రదర్ మరియు క్షణ క్షణం వంటి ఆయన నిర్మించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2008లో రాఖీ చిత్రానికి ఉత్తమ నిర్మాత విభాగంలో సంతోషం చిత్ర అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు.