న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ 36 గంటల్లోనే రెండు డేరింగ్ ఆపరేషన్లు చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల నుంచి తాజాగా 19 మంది పాక్ నావికుల్ని భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర కాపాడింది. సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ ఫిషింగ్ నౌకను సోమాలియా దొంగలు చుట్టుముట్టారు. 19 మంది పాకిస్తానీ నావికుల్ని బంధించారు. దీనిపై సమాచారం అందుకున్న ఐఎన్ఎస్ సుమిత్ర రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. బందీలను విడిపించింది.
అంతకు ముందు కూడా భారత్ ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటును పైరేట్లు అపహరించారు. ఈ బోటు నుంచి ఆదివారం సమాచారం అందిన వెంటనే ఐఎన్ఎస్ సుమిత్ర,హెలికాప్టర్ లను రంగంలోకి దించిన నేవీ 17 మంది మత్స్యకారులను రక్షించింది. తాజాగా శ్రీలంక ఫిషింగ్ నౌకను రక్షించడంలో ఇండియన్ నేవీ సహాయం చేసింది. మంగళవారం లోరెంజో పుతా నౌకను మొగదిషు తీరంలో ముగ్గురు పైరేట్లు హైజాక్ చేయగా.. ఐఎన్ ఎస్ శారద.. సీ గార్డియన్ డ్రోన్ లను రంగంలోకి దించింది. మన నేవీ ఇచ్చిన సమాచారంతో శ్రీలంక నౌకను సీషెల్స్ తీరంలో వారి కోస్ట్ గార్డ్ కాపాడింది.