ఏడో స్థానంలో భారత్
యూపీఐతో భారీగా పుంజుకున్న పేమెంట్లు
కరోనాతో మరింత పెరిగిన యూపీఐ వాటా
గత పదేళ్లలో ఎన్నో మార్పులు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ టెక్నాలజీ సెక్టార్లో గత పదేళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. డిజిటల్ పేమెంట్స్ బాగా పెరిగాయి. ఈ సెక్టార్లో ఉన్న కంపెనీలు, స్టార్టప్లు మరింత ముందుకు దూసుకెళ్లాయి. దీనికి నిదర్శనం ఇటీవల చోటు చేసుకున్న రెండు పరిణామాలే. ఒకటి మన ఇండియన్ కంపెనీ రేజర్పే బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో యూనికార్న్గా అవతరించడం. రెండోది నైజీరియాకు చెందిన పేస్టాక్ను స్ట్రైప్ అనే ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీ కొనుగోలు చేయడం. నైజీరియా స్టార్టప్కు ఇది అతిపెద్ద డీల్. డిజిటల్ పేమెంట్స్లో చైనా లీడర్గా ఎదిగింది. ఇండియా ఏడోస్థానంలో కొనసాగుతోంది. చైనా జరిపే మొత్తం ట్రాన్సాక్షన్స్లో ఎనిమిదింట ఒక వంతు లావాదేవీలను మాత్రమే ఇండియా చేస్తోంది. కానీ గ్రోత్లో మాత్రం ఇండియా ఎప్పుడో చైనాను అందుకుంది. 2016లో ఆర్బీఐ యూపీఐను తీసుకొచ్చింది. ఇది వచ్చిన తర్వాత.. అకౌంట్ టు అకౌంట్ మనీని పంపించుకోవడం మరింత తేలికైంది. 2017–18 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాల్యుమ్ టర్మ్స్లో యూపీఐ వాటా 9 శాతంగా ఉంది. వాల్యు టర్మ్స్లో ఒక శాతంగా రికార్డయింది. కానీ 2020 ఫిబ్రవరి నాటికి యూపీఐ షేరు వాల్యుమ్ టర్మ్స్లో 50 శాతం, వాల్యు టర్మ్స్లో 16 శాతం దాటేసింది. రిటైల్ డిజిటల్ పేమెంట్స్లో యూపీఐ వాటా పెరగడమే తప్ప.. అప్పటి నుంచి ఎక్కడా తగ్గుదల లేదు. ఈ కరోనా మహమ్మారితో యూపీఐ వాటా మరింత పెరిగింది. స్మార్ట్ఫోన్ వాడకం పెరగడం, తక్కువ లావాదేవీ ఖర్చు, యూజర్ ఎక్స్పీరియెన్స్ ఎప్పడికప్పుడు మెరుగుపర్చడం వంటి వాటితో ఫిన్టెక్ సెక్టార్లో కొత్త బిజినెస్ మోడల్స్ మరిన్ని పుట్టుకొస్తున్నాయి.
ఫిన్టెక్ రంగంలో ఉన్న స్టార్టప్లు రిటైల్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ల కోసం సరికొత్త ఇనోవేషన్లను తెస్తున్నాయి. బ్యాంక్లు కూడా వాలెట్లు, డిజిటల్ లెండింగ్, పేమెంట్ సర్వీసెస్, సేవింగ్స్, వెల్త్ మేనేజ్మెంట్, రెమిటెన్స్లు వంటి పలు సెగ్మెంట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీబీ ఇన్సైట్స్ ప్రతి దేశం నుంచి ఫిన్టెక్ రంగంలో ఉన్న టాప్ 250 కంపెనీల జాబితాను రూపొందించింది. ఈ లిస్ట్లో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. 136 కంపెనీలతో అమెరికా తొలి స్థానంలో ఉంది. ఇండియన్ఫిన్టెక్ కంపెనీల్లో పాలసీబజార్, పైన్ల్యాబ్స్, రేజర్పే వంటివి ఉన్నాయి.
ప్రస్తుతం ఏడో స్థానంలో ఇండియా…
బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్(బీఐఎస్) 2018 రిపోర్ట్లో డిజిటల్ పేమెంట్స్లో ఇండియా ఏడో స్థానంలో ఉంది. ఆ ఏడాది ఇండియాలో రోజుకు 67 మిలియన్ పేమెంట్స్ జరిగాయి. అంటే చైనా జరిపే ట్రాన్సాక్షన్స్లో ఎనిమిదింట ఒక వంతు మాత్రమే ఇండియా జరిపింది. కానీ కేవలం ఆరేళ్లలోనే ఇండియా ఎనిమిదింతల గ్రోత్ను నమోదు చేసింది. అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో ఇండియా ఇంకా చాలా దూరంలోనే ఉందని బీఐఎస్ డేటా చెబుతోంది. ఇండియాలో ఏడాదికి ఒక వ్యక్తి 18 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను మాత్రమే జరిపినట్టు పర్ క్యాపిటా పెనట్రేషన్ బట్టి బీఐఎస్ డేటా వెల్లడించింది. ఇది సౌదీ అరేబియా(38), మెక్సికో(40)లతో పోలిస్తే చాలా తక్కువ. చైనాలో ఒక వ్యక్తి ఏడాదికి 142 ట్రాన్సాక్షన్స్, అమెరికాలో 495, సింగపూర్లో 831 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను జరుపుతున్నట్టు బీఐఎస్ డేటా చెప్పింది.
డెబిట్, క్రెడిట్ కార్డు జనరేషన్ పెంచాలి…
డెబిట్, క్రెడిట్ కార్డులు ఇండియాలో ఇంకా పెరగాలి. కేవలం 33 శాతం మంది వద్దనే ఇండియాలో డెబిట్ కార్డు ఉంటోంది. సింగపూర్లో 92 శాతం మంది వద్ద, జపాన్లో 87 శాతం మంది వద్ద, చైనాలో 67 శాతం మంది వద్ద 15 ఏళ్ల వారికి డెబిట్ కార్డు ఉంటున్నట్టు వరల్డ్ బ్యాంక్ తెలిపింది. 24 దేశాల్లో కేవలం 9 దేశాల్లోనే రియల్ టైమ్లో ట్రాన్సాక్షన్స్ను సెటిల్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 2018లో చైనాలో 95 శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్లో సెటిల్ అయ్యాయి. ఇండియాలో ఈ సంఖ్య వాల్యుమ్ టర్మ్స్లో 29 శాతం, వాల్యు టర్మ్స్లో 7 శాతంగా ఉంది.