ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్కు ఇండియా హాకీ టీమ్ రెడీ అయ్యింది. నేడు జరిగే తొలి మ్యాచ్లో కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకు ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ఇండియా 2019లో రన్నరప్తో సరిపెట్టుకుంది. మళ్లీ ఆ తర్వాత టోర్నీలో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. బెల్జియం, కెనడా, కొరియా, న్యూజిలాండ్, మలేషియా కూడా బరిలో ఉన్నాయి.
రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. కొరియా తర్వాత ఇండియా.. బెల్జియం (24న), మలేషియా (26న), న్యూజిలాండ్ (27న), కెనడా (29న)తో తమ లీగ్ మ్యాచ్లు ఆడనుంది. 2026 ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ వరల్డ్ కప్, 2026 ఆసియా క్రీడల నేపథ్యంలో ఇండియా ఈ టోర్నీలో కొత్త కుర్రాళ్లను పరీక్షించనుంది.
గోల్ కీపర్లుగా పవన్, మోహిత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డిఫెన్స్లో పూవన్న, నీలమ్ సంజీప్, యష్దీప్ సివాచ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిడాస్, కెప్టెన్ సంజయ్ కీలకం కానున్నారు. మిడ్ ఫీల్డ్ బాధ్యతలను రాజిందర్ సింగ్, రాజ్కుమార్ పాల్, నీలకంఠ శర్మ, రబీచంద్ర సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, మహ్మద్ రహీల్ మోయనున్నారు.
