దుబాయ్: ఐసీసీ వార్షిక వన్డే ర్యాంకింగ్స్లో ఇండియా క్రికెట్ టీమ్ నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. సోమవారం విడుదల చేసిన తాజా జాబితాలో టీమిండియా ఖాతాలో 118 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వార్షిక అప్డేట్లో భాగంగా 2025 మే నెల నుంచి ఆడిన మ్యాచ్లకు వంద శాతం వెయిటేజీని, అంతకుముందు రెండేళ్ల ఫలితాలకు 50 శాతం వెయిటేజీని పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ఈ ర్యాంక్లను ప్రకటించింది. ఈ క్రమంలో ఇండియా ఒక్క రేటింగ్ పాయింట్ను కోల్పోయినా.. అగ్రస్థానాన్ని కాపాడుకుంది.
న్యూజిలాండ్ (113), ఆస్ట్రేలియా (109), సౌతాఫ్రికా (102), పాకిస్తాన్ (98) టాప్–5లో కొనసాగుతున్నాయి. శ్రీలంక (96), అఫ్గానిస్తాన్ (93), ఇంగ్లండ్ (89), బంగ్లాదేశ్ (84), వెస్టిండీస్ (74) తర్వాతి ర్యాంక్ల్లో ఉన్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించే క్రమంలో ఈ ర్యాంకింగ్స్ చాలా కీలకం కానున్నాయి. 31 మార్చి 2027 నాటికి టాప్–8లో నిలిచే జట్లు నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలుగా సౌతాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. ఒకవేళ సౌతాఫ్రికా టాప్–8లో ఉంటే 9వ ర్యాంక్లో ఉండే జట్టుకు కూడా వరల్డ్ కప్లో ఆడే చాన్స్ దక్కుతుంది.
