
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో ఇండియా నుంచి బండ్ల ఎగుమతులు ఏడాది లెక్కన 26శాతం వృద్ధి చెందాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్, త్రివీలర్ వాహనాల ఎగుమతులు అత్యధిక స్థాయికి చేరాయి. ప్యాసింజర్ వాహన ఎగుమతులు సెప్టెంబర్లో ఏడాది లెక్కన 23శాతం పెరిగి 2,41,554 యూనిట్లకు చేరాయి.
ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 20.5శాతం పెరిగి 1,25,513 యూనిట్లకు, యుటిలిటీ వాహనాలు 26శాతం పెరిగి 1,13,374 యూనిట్లకు , వ్యాన్లు 39శాతం పెరిగి 2,667 యూనిట్లకు చేరాయి. మారుతి సుజుకీ 2,05,763 బండ్లను, హ్యుందాయ్ 99,540 బండ్లను ఎగుమతి చేశాయి. టూవీలర్ వాహనాలు క్యూ2లో ఏడాది లెక్కన 25శాతం పెరిగి 12,95,468 యూనిట్లకు చేరాయి. ఇందులో స్కూటర్ల వాటా 1,77,957 యూనిట్లుగా ఉంది.
మోటార్సైకిళ్లు 27శాతం పెరిగి 11,08,109 యూనిట్లకు చేరుకున్నాయి. మోపెడ్ ఎగుమతులు 9,402 యూనిట్లుగా నమోదయ్యాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే మాత్రం 364శాతం వృద్ధి నమోదైంది. కమర్షియల్ వాహనాల ఎగుమతులు 22శాతం పెరిగి 24,011 యూనిట్లుగా, త్రీవీలర్ వాహనాల ఎగుమతులు 51శాతం పెరిగి 1,23,480 యూనిట్లుగా రికార్డయ్యాయి.