ప్రపంచ మహమ్మారి ఒప్పందాన్ని భారత్ వ్యతిరేకించాలి

ప్రపంచ మహమ్మారి ఒప్పందాన్ని భారత్ వ్యతిరేకించాలి

78వ  ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ కోసం తాత్కాలిక ఎజెండాలో భాగంగా 14 మే 2025న  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ ఒక నివేదికను సమర్పించారు.  మహమ్మారి నివారణ,  సంసిద్ధత, ప్రతిస్పందనపై ప్రపంచ దేశాల మధ్య ఒప్పందాన్ని రూపొందించడానికి 2021లో ఒక వేదికను డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసింది. దాని ఫలితం ఈ నివేదిక.  ఇందులో ఒప్పందం ముసాయిదా ఉన్నది. ఆ ఒప్పంద ముసాయిదా ప్రజాస్వామ్యవాదులకు, దేశాల సార్వభౌమత్వాన్ని కోరేవారికి ఆందోళన 

మే 20న 78వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఈ ముసాయిదా మీద తీర్మానం ఆమోదం పొందింది అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ అసెంబ్లీలో భారతదేశం కూడా ఉన్నది. ఆ ప్రకటన ప్రకారం 124 దేశాలు ముసాయిదా ఒప్పందానికి ఆమోదం తెలిపాయి. 11 దేశాలు పాల్గొనలేదు, ఏ దేశమూ వ్యతిరేకించలేదు. ఈ ఒప్పందాన్ని అనేక కారణాల వల్ల తిరస్కరించాల్సిన అవసరం ఏర్పడింది.  

ఈ ఒప్పందం వ్యాధులను నియంత్రించే శాస్త్రాలను కాకుండా లాభాపేక్ష ఆధారిత సంబంధిత ఉత్పత్తులను ఆమోదిస్తుంది.  ఈ ముసాయిదా ఒప్పందంలో కొన్ని కొత్త సాధనాలు ప్రతిపాదించారు. ఇందులో మూడు ప్రధాన సాధనాల ద్వారా అత్యవసర ఫార్మాస్యూటికల్ హాస్పిటల్ పారిశ్రామిక సముదాయాన్ని భారీగా విస్తరించడానికి పునాది వేస్తున్నది.  

మహమ్మారి వ్యాధులను నిర్ధారించే వ్యవస్థ అంతర్జాతీయం కానున్నది.  పబ్స్ (PABS) అంటే వ్యాధికారక యాక్సెస్, ప్రయోజనాల భాగస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే ఒక మహమ్మారి ప్రకటించిన తరువాత ప్రతి దేశం తమ దేశంలో ఆ వైరస్ బాధితుల జీవకణాల నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపాలి. ఈ నమూనాలు ప్రైవేటు ఫార్మా కంపెనీలకు అందజేస్తుంది ఆ సంస్థ. వారు ఈ నమూనాలను పరీక్షించి, పరిశోధించి తగిన జన్యు చికిత్స ఉత్పత్తులను, టీకాలను తయారుచేస్తారు. ఈ వ్యాపారంలో వచ్చే లాభాలు ఆయా దేశాలకు ఏ మేరకు అందించాలి అని చర్చలు సాగుతున్నాయి.

 ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదన ఆయా కంపెనీలు ఈ నమూనాలు ఇచ్చినందుకు తమ ఉత్పత్తులలో కేవలం 10 శాతం ఉచితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇస్తారు. ఇంకో 10 శాతం తక్కువ ధరకు అందిస్తారు. అయితే, పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, టీకా కంపెనీలు లేని దేశాలు ఈ జన్యు చికిత్స సాధనాలు, టీకాలు మార్కెట్ ధరలకు కొనుక్కోవాల్సిందే.  డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదన వెనుక బహుళజాతి సంస్థల ప్రయో జనాలు ఉన్నాయని చాలా దేశాలు భావిస్తున్నాయి.

కంపెనీల లాభాపేక్ష

ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారి వచ్చినాక తాను ప్రతిపాదించే చికిత్స విధానంలో భాగంగా  సభ్యత్వ దేశాలకు ఫార్మా ఉత్పత్తులను వేగంగా చేరవేయడానికి, ఒక ప్రపంచ సరఫరా గొలుసు, లాజిస్టిక్స్ నెట్‌‌‌‌వర్క్ ప్రతిపాదించింది. ఇది కూడా ప్రతి దేశంలో ఉండే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, లేనట్టుగానే భావిస్తూ ప్రతిపాదించడమైనది.

 భారత దేశంలో ఉన్న వైవిద్యభరితమైన వ్యవస్థను అసలు పరిగణించడం లేదు. ప్రతి దేశం మహమ్మారి పట్ల స్పందించే స్వతంత్ర వ్యవస్థను కోల్పోతాయి.  దిగుమతుల మీద ఆధారపడతాయి. ఈ ఒప్పందంలోని కార్యక్రమాలకు ఆర్థిక వనరులను సమకూర్చడానికి ఒక సమన్వయ యంత్రాంగం ఉండాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించి ప్రతిపాదించింది. ఈ ఒప్పందంలో చివరికి అన్నీ కూడా బహుళ జాతి ఫార్మా ఉత్పత్తులే కనుక ఈ ఆర్థిక వనరులు వాటికి పెట్టుబడులకు నిర్దేశించినట్టుగా ఉన్నాయి. ప్రతి దేశంలో ఉన్న వివిధ చికిత్స వ్యవస్థలు (ఆయుర్వేద, హోమియో తదితర) స్థానిక ఫార్మా రంగంతో సహ బలోపేతం కాకపోగా, ఈ ఒప్పందం వలన బడా కంపెనీలకు వనరులు అందించే వ్యవస్థ తయారు చేస్తున్నారు. 

ఇతర అంతర్జాతీయ సమావేశాల మాదిరిగా కాకుండా, ఈ ఒప్పందం కోసం ఉండే జనరల్ బాడీ పార్టీల సమావేశం ఒక వ్యక్తి (WHO డైరెక్టర్ జనరల్‌‌‌‌)కు లోబడి ఉంటుంది.  సభ్య దేశాలతోపాటు ఈ ఒప్పంద వ్యవహారంలో ప్రైవేట్, ప్రభుత్వేతర బహుళదేశ సంస్థలు ఆర్థికంగా అనుసంధానించి ఉంటాయి. ఆర్థిక సంబంధాలు సాధారణంగా కంపెనీల లాభాపేక్షతో ముడిపడి ఉంటాయి. ఆ విధంగా చూస్తే ఈ ఒప్పందం ద్వారా కంపెనీల ఉత్పత్తులను దేశాల మీద రుద్దడానికి ఉపయోగపడుతుంది. 

ప్రభుత్వేతర శక్తుల ఆలోచన

భారత వైద్య ఆరోగ్య రంగానికి ఈ ముసాయిదా ఒప్పందం ప్రయోజనకరం కాదు. ఆమోదించలేం. ప్రకృతిలో భాగమైన జీవాలపై, జీవ జాతుల మధ్య వైవిధ్యంలో సమతుల్యతపై భారతదేశం ఎప్పుడూ పేటెంట్లను  అంగీకరించలేదు. ఈ ఒప్పందం అటువంటి పేటెంట్లను అనివార్యంగా ప్రోత్సహిస్తుంది. 

సభ్య దేశాలు దీని గురించి కనీస ఆలోచన చేసే అవసరం లేకుండా ప్రకృతిలో సహజ జీవాల మీద, జీవాల కణాల మీద, జీవాల జీవన పద్దతుల మీద పేటెంట్ వ్యవస్థను ఈ ఒప్పందంలో భాగంగా తోస్తున్నారు. జీవాలు అంటే సమస్తం. అతిసూక్ష్మ వైరస్​ల నుంచి జంతువులు, పక్షులు ఆఖరికి మనుషుల వరకు ఇందులో ఉంటాయి. ప్రధానంగా అమెరికాకు తిరిగి ట్రంప్ అధ్యక్షుడైన తరువాత అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చినాక ఈ ఒప్పందంలో అనేక అంశాలు మారిపోయాయి. 

ఒక్క దేశం వైదొలిగిన తరువాత ఒప్పందంలో ప్రతిపాదించిన అంశాల మార్చడంలోనే దీని వెనుక ఉన్న ప్రభుత్వేతర శక్తుల ఆలోచన విధానం అర్థం అవుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాధుల నివారణలో, చికిత్సలో ఒకే పద్దతి, ఒకే సంస్థ, ఒకే నిర్వహణ పత్రం  ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఒప్పందం దానిని తప్పనిసరి చేస్తోంది.  

ఒక ఆరోగ్య సంస్థ ప్రతి సభ్యత్వ దేశంలో రాజకీయ విధానాలు, సామాజిక వాతావరణం, ఆర్థిక విధానాలు, ఉత్పత్తి రంగాలను నిర్ధేశించే అవకాశం ఈ ఒప్పందం ద్వారా సమకూర్చుకుంటున్నది.  ముసాయిదా ఒప్పందం మొదటి పేజీలో మహమ్మారి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందనపై తన మార్గనిర్దేశక పాత్రను అధికారికంగా గుర్తించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతున్నది. 

డబ్ల్యూహెచ్​ఓ నుంచి భారత్​ వైదొలగాలి

ప్రపంచ ఆరోగ్య సంస్థకు దిశా నిర్దేశానికి ఉపయోగిస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలను పోయిన సంవత్సరం సవరించింది. ఈ సవరణ కోసం అనేక అప్రజాస్వామిక పద్దతులను అవలంబించింది. PABS వ్యవస్థ మీద ఏకాభిప్రాయం ఇంకా రాలేదు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు తగిన ఒప్పందం ముసాయిదా కోసం ఇంకొక కమిటీని ఇటీవల ఏర్పాటు చేశారు. 

ఈ కమిటీ ఇచ్చే ముసాయిదా ప్రతి వచ్చే సంవత్సరం 2026లో 79 వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఆమోదం తరువాత ఈ ప్రపంచ ముసాయిదా ఒప్పందానికి జోడిస్తారు. అప్పుడు ఇది పూర్తి స్థాయి ఒప్పందంగా ప్రకటిస్తారు. తదనంతరం ప్రతి దేశం వారి నిర్ణయం మేరకు సంతకాలు చేస్తారు.  బహుళ జాతి ఫార్మా కంపెనీలు గుప్పిట్లో ఉన్న డబ్ల్యూహెచ్ఓ నుంచి భారతదేశం వైదొలగాలి అని డిమాండ్లు వస్తున్నాయి. ఈ సంస్థ  చైనా ప్రాబల్యంలో పని చేస్తున్నది అని భావించి అమెరికా దేశం ఈ సంస్థ  సభ్యత్వం నుంచి నిష్క్రమించింది. ఈ ముసాయిదా ఒప్పందాన్ని భారత ప్రజలు ఇదివరకే తిరస్కరించారు. భారత ప్రభుత్వం దీనిని తిరస్కరించాలి.


టీకా కంపెనీలపై ఆధారపడిన డబ్ల్యూహెచ్ఓ

వాణిజ్య టీకా తయారీ కంపెనీల మీద ఆధారపడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రీయంగా, స్వచ్ఛంగా పని చేస్తుంది అనే నమ్మకం లేకుండా పోయింది.  ఈ ముసాయిదా మీద చర్చలు చాలా గోప్యంగా జరిగాయి. అదనంగా, 400 ప్రభుత్వేతర సంస్థలలో అనేకం ఈ చర్చలలో పాల్గొన్నాయి.  దాదాపు అన్నింటికీ  ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఏదో లావాదేవీలు ఉన్నవే.  ఆయా సంస్థల పరస్పర విరుద్ధ ప్రయోజనాల గురించి కొందరు ప్రజాప్రతినిధులు  ప్రశ్నించారు. 

అటువంటి సంస్థలను విశ్వశిస్తున్న డబ్ల్యూహెచ్ఓ ముసాయిదా ఒప్పందం చర్చలలో ప్రజలను భాగస్వాములను చేయకపోవడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం.  ప్రజాస్వామ్య దేశమైన మన ప్రభుత్వం ఈ ముసాయిదా ఒప్పందం ప్రజల ముందు పెట్టి వారి ఆమోదంతోనే ఒప్పందం మీద సంతకాలు పెట్టాలి. ఆరోగ్య సంరక్షణలో ఒక అంతర్జాతీయ సాంకేతిక సంస్థగా ఏర్పడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే శాస్త్రీయ సంస్థగా ఎదిగే దారిని వదిలివేసింది. 

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​-