న్యూఢిల్లీ: గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్-2020లో ఇండియా 105వ పొజిషన్లో నిలిచింది. గతేడాది ర్యాంకింగ్స్ (79వ స్థానం)తో పోల్చితే భారత్ 26 స్థానాలు దిగజారింది. అయితే ఈ ర్యాంకింగ్స్లో పొరుగున ఉన్న చైనా కంటే భారత్ మెరుగైన స్థానం సాధించడం గమనార్హం. చైనా 124వ ర్యాంకులో నిలిచింది. న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, యూఎస్, ఆస్ట్రేలియా, మారిషస్, జార్జియా, కెనడా, ఐర్లాండ్ టాప్-10లో నిలిచాయి. వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ను కెనడాకు చెందిన ఫ్రేసర్ ఇన్స్టిట్యూట్ రూపొందిస్తుంది. ఇండియాలో ఎకనామిక్ ఫ్రీడమ్ రాబోయే సంవత్సరాల్లో ప్రవేశపెట్టే సంస్కరణలను బట్టి ఉంటుందని ఫ్రేసర్ తెలిపింది. ఇండియా ఎకనామిక్ ఫ్రీడమ్ను సెక్టార్ల వారీగా చూసుకుంటే వచ్చిన మార్పులను గమనించొచ్చు. ప్రభుత్వం 8.22 నుంచి 7.16కు, న్యాయ వ్యవస్థ, ఆస్తి హక్కులు 5.17 నుంచి 5.06కు, ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ విషయంలో 6.08 నుంచి 5.71కి, క్రెడిట్, లేబర్, బిజినెస్ రెగ్యులేషన్లో 6.63 నుంచి 6.53కి పడిపోయిన తగ్గుదలను చూడొచ్చు. వ్యక్తిగత ఎంపిక, మార్కెట్లలోకి ప్రవేశించే సత్తా, ప్రైవేటు ఆస్తుల రక్షణ, చట్టాలు, పాలసీలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా 162 దేశాల్లో సర్వే నిర్వహించి ఈ ర్యాంకింగ్స్ ప్రకటిస్తారు.
