- మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: స్వాతంత్ర్యం సాధించి వందేండ్లు పూర్తి అయ్యే నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశం నలుమూలలా అభివృద్ధి చెంది, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
మోదీ 12 ఏండ్ల పాలనలో దేశం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిందని, గతంలో 10వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం జపాన్ను వెనక్కి నెట్టి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 12 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారులు, రింగ్ రోడ్డు, బైపాస్, గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఎఫ్ రోడ్ల విస్తరణ పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాగుతున్నాయని తెలిపారు.
