ఎల్బీనగర్/షాద్నగర్, వెలుగు : నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మల్కాజ్గిరి ఎస్వోటీ టీమ్, తిరుమలగిరి పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ సమీపంలో తనిఖీలు చేస్తుండగా.. ఓ కారులో నకిలీ విత్తనాలు రవాణా చేస్తున్నట్లు గుర్తించి, వాటిని సీజ్ చేశారు.
ఈ కేసులో బండ్లగూడకు చెందిన న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ ఎండీ ఎరువ బాలాషోరెడ్డి అలియాస్ శివారెడ్డి, సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న నిజామాబాద్ మాక్లూర్కు చెందిన కాపర్తి బెంజిమెన్, జీడిమెట్లకు చెందిన డొంగ శ్రీనును అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.30 లక్షల విలువైన 12,800 నకిలీ పత్తి విత్తనాల పౌచ్లు, సుమారు 2 వేల కిలోల నకిలీ విత్తనాలు, కారు, మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుమతి వెల్లడించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం లాల్సింగ్తండాలో అక్రమంగా నిల్వ చేసిన ఉంచిన నిషేధిత హెచ్టీ కాటన్ (బిజీ- 3) పత్తి విత్తనాలను శుక్రవారం అగ్రికల్చర్ అధికారులు, షాద్నగర్ పోలీసులు పట్టుకున్నారు.
గ్రామంలోని పల్త్యావత్ కవిత ఇంట్లో నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి 22.8 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్చార్జి వ్యవసాయాధికారి రాజేందర్రెడ్డి, ఏఈఓ బొడ్డు వినయ్ తెలిపారు.
