అతను ఇంకో దేశానికి పారిపోకుండా చూడాలని భారత్ విజ్ఞప్తి
ఖాట్మాండు : ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్ నేపాల్ లో దాక్కున్నట్లు మన దేశం అనుమానిస్తున్నది. అతను నేపాల్ నుంచి వేరే దేశానికి పారిపోకుండా చూడాలని, ఇండియన్ పాస్ పోర్టు లేదా ఏదైనా ఫేక్ పాస్ పోర్టుతో పారిపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే అరెస్టు చేయాలని నేపాల్ ప్రభుత్వాన్ని ఇండియా కోరింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ కాన్సులర్ సర్వీసెస్ కు సోమవారం లేఖ రాసింది. అమృత్ పాల్ను అరెస్టు చేయడంలో ప్రభుత్వ సంస్థలు సాయం చేయాలని ఖాట్మండులోని ఇండియన్ ఎంబసీ కోరింది.
అమృత్ కు సంబంధించిన వివరాలను అన్ని హోటళ్లు, ఎయిర్ లైన్స్ కు ఎంబసీ సర్క్యులేట్ చేసింది. అతడి వద్ద నకిలీ పాస్ పోర్టులు ఉన్నాయని ఎంబసీ అనుమానిస్తోంది. కాగా, ఈనెల 18 నుంచి అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. మరోవైపు అమెరికాలోని న్యూయార్క్ లో టైమ్స్ స్క్వేర్ వద్ద అమృత్ పాల్ కు మద్దతుగా ఖలిస్తానీ మద్దతుదారులు భారీ సంఖ్యలో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు రిచ్ మండ్ హిల్ నుంచి టైమ్స్ స్క్వేర్ వరకు కార్లతో ర్యాలీ తీశారు.