ప్రాణాంతక వైరస్ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య చైనాలో రోజురోజుకు పెరుగుతోంది. దీంతో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా చైనాలోని వుహాన్ నగరం నుంచి 600 మందికి పైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తరలించింది. అలాగే భారత్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనీయులకు, చైనాలో నివసిస్తున్న విదేశీయులకు ఆన్లైన్ వీసా సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఇండియా ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని బీజింగ్లోని భారత ఎంబసీ తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఈవీసా మీద భారత పర్యటనకు వెళ్లాలనుకే సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంది.

