డిసెంబర్ 15 నుంచి విదేశాలకు ఫ్లైట్స్..14 దేశాలకు నో

డిసెంబర్ 15 నుంచి విదేశాలకు ఫ్లైట్స్..14 దేశాలకు నో

కరోనా వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుంచి విదేశాలకు రెగ్యులర్ సర్వీసులను స్టార్ట్ చేయబోతున్నట్లు శుక్రవారం కేంద్రం ప్రకటించింది. అయితే 14 దేశాలకు మాత్రం విమానాలను ఇప్పుడే నడపబోవడం లేదని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా వైరస్ తీవ్ర ఎక్కువగా ఉన్న, కొత్త వేరియంట్ ప్రభావం ఉన్న దేశాలకు విమానాలను సర్వీసులపై నిషేధం కొనసాగించాలని నిర్ణయించింది. 

బ్యాన్ కొనసాగే దేశాల్లో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నెథర్లాండ్స్, ఫిన్లాండ్‌, దక్షిణాఫ్రికా, బోత్సవానా, జింబాబ్వే, బ్రెజిల్, బంగ్లాదేశ్, చైనా, మారిషస్, న్యూజిలాండ్, సింగపూర్‌‌ దేశాలు ఉన్నాయని తెలిసింది. ప్రపంచ దేశాల్లో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై ఆరోగ్య శాఖతో చర్చించి, ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌ పై నిర్ణయం తీసుకుంది.  దక్షిణాఫ్రికా, బోత్సవానా సహా పలు దేశాల్లో తాజాగా గుర్తించిన కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లకు లొంగే అవకాశం లేకపోవచ్చని సైంటిస్టులు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయా దేశాలకు రెగ్యులర్ విమాన సర్వీసులను రీస్టార్ట్ చేయకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లిస్టులో ఉన్న 14 దేశాల్లో కొన్నింటితో ఎయిర్‌‌ బబుల్ అగ్రిమెంట్లు ఉన్నాయని, ఆ దేశాలకు వారానికోసారి ఫ్లైట్ సర్వీసులు ఉండొచ్చని ఏవియేషన్ శాఖ అధికారులు చెప్పారు.

కరోనా తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడంతో...

కరోనా కారణంగా 2020 మార్చి చివరి వారంలో రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను వెనక్కి తీసుకొచ్చేందుకు ‘వందే భారత్’ పేరుతో ఫ్లైట్ నడిపింది. అయితే కరోనా ప్రభావం కొంత మేర తగ్గాక.. కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ అగ్రిమెంట్లు చేసుకుని.. విమాన సర్వీసులు నడిపిస్తోంది. అయితే కరోనా ప్రభావం క్రమంగా చాలా వరకూ తగ్గుతూ రావడం, వ్యాక్సినేషన్ కూడా భారీ స్థాయిలో పూర్తికావడంతో రెగ్యులర్ సర్వీసులు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.