- తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 218
- ఇండియా తొలి ఇన్నింగ్స్ 135/1
- రోహిత్, యశస్వి హాఫ్ సెంచరీలు
ధర్మశాల: ఓవైపు కుల్దీప్ యాదవ్ (5/72).. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ (4/51).. మధ్యలో జడేజా (1/17) చేసిన స్పిన్ మాయాజాలానికి ఇంగ్లండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయిన్రు. బొంగరంలా గిర్రున తిరిగిన బాల్ను టచ్ చేయడానికి కూడా భయపడిన్రు. ఫలితంగా గురువారం మొదలైన ఐదో టెస్ట్లో ఇండియా తొలి రోజే మ్యాచ్పై పట్టు బిగించింది. జాక్ క్రాలీ (79) ఒంటరి పోరాటం చేయడంతో.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 రన్స్కు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా ఆట ముగిసే టైమ్కు తొలి ఇన్నింగ్స్లో 30 ఓవర్లలో 135/1 స్కోరు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58 బాల్స్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57) మెరుపు ఆరంభాన్నిస్తే, రోహిత్ (52 బ్యాటింగ్), శుభ్మన్ గిల్ (26 బ్యాటింగ్) దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
కుల్దీప్ కేక..
ఫ్లాట్ వికెట్పై టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను తొలి 15 ఓవర్లు పేసర్లు బుమ్రా, సిరాజ్ ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. దీంతో ఓపెనర్లు క్రాలీ, బెన్ డకెట్ (27) స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. డిఫెన్స్కు పోకుండా కవర్ డ్రైవ్స్తో గ్యాప్ల్లోకి బాల్ను పంపి స్కోరును క్రమంగా పెంచారు. ఈ క్రమంలో క్రాలీ 64 బాల్స్లో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. వీళ్లు క్రీజులో కుదురుకోవడంతో రోహిత్..16వ ఓవర్లో వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ను ఛేంజ్ బౌలర్గా తీసుకొచ్చాడు. ఆ వెంటనే 18వ ఓవర్లో కుల్దీప్ను రెండో ఎండ్ నుంచి మోహరించాడు. తొలి ఐదు బాల్స్లో రెండు ఫోర్లు ఇచ్చిన కుల్దీప్.. లాస్ట్ బాల్కు డకెట్ను ఔట్ చేశాడు. తొలి వికెట్కు 64 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. సెషన్ లాస్ట్ ఓవర్లో కుల్దీప్ దెబ్బకు పోప్ (11) వెనుదిరగడంతో ఇంగ్లండ్ 100/2తో లంచ్కు వెళ్లింది.
94 రన్స్కే 6 వికెట్లు..
లంచ్ తర్వాత కుల్దీప్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిలలాడింది. సింగిల్ రన్ చేయకుండా మూడు వికెట్లు కోల్పోయింది. సెషన్ రెండో బాల్కే క్రాలీని కుల్దీప్ ఎల్బీ చేశాడు. డీఆర్ఎస్లో ఈ వికెట్ దక్కింది. జానీ బెయిర్స్టో (29), జో రూట్ (26) ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 38 రన్స్ జోడించినా కుల్దీప్, జడేజా మ్యాజిక్ ముందు బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. ఈ ఇద్దరు వరుస ఓవర్లలో బెయిర్స్టో, రూట్, బెన్ స్టోక్స్ (0)ను పెవిలియన్కు పంపారు. దీంతో ఇంగ్లండ్ 175 రన్స్ వద్దే 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ సెషన్లో 94 రన్స్కే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ను అశ్విన్ ముప్పుతిప్పలు పెట్టాడు. బెన్ ఫోక్స్ (24) కాసేపు ఆడినా, టామ్ హర్ట్లీ (6), మార్క్ వుడ్ (0), అండర్సన్ (0) వరుస విరామాల్లో వెనుదిరిగారు. బషీర్ (11 నాటౌట్) మిగిలిపోయాడు.
ఇంగ్లండ్పై ఒకే టెస్ట్ సిరీస్లో అత్యధిక రన్స్ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్గా యశస్వి జైస్వాల్ (712) రికార్డులకెక్కాడు. కోహ్లీ (655)ని అధిగమించాడు. ఇదే క్రమంలో ద్వైపాక్షిక సిరీస్లో 700లకు పైగా రన్స్ చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు. సునీల్ గావస్కర్ (774, 732) ముందున్నాడు.
9 అతి తక్కువ టెస్ట్ల్లో (9) వెయ్యి రన్స్ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. గావస్కర్, పుజారా (11) రికార్డును బ్రేక్ చేశాడు. ఇక డెబ్యూ తర్వాత అతి తక్కువ రోజుల్లోనే (239) వెయ్యి రన్స్ చేసిన ప్లేయర్ గా.. రాహుల్ ద్రవిడ్ (299 రోజులు) రికార్డును అధిగమించాడు.
బాల్స్ పరంగా టెస్ట్ల్లో వేగంగా 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (1871 బాల్స్). అక్షర్ పటేల్ (2205), బుమ్రా (2520)ను వెనక్కి నెట్టాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో 60 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్లు పట్టిన తొలి ప్లేయర్ రోహిత్ శర్మ. ఇప్పటి వరకు ఏ ప్లేయర్ ఈ ఫీట్ సాధించలేదు. మార్క్ వుడ్ క్యాచ్ అందుకోవడం ద్వారా హిట్మ్యా న్ ఈ అరుదైన ఘనతను అందుకున్నా డు. డబ్ల్యూటీసీలో 50 సిక్స్లు కొట్టిన తొలి ప్లేయర్ కూడా రోహితే.