- దంచికొట్టిన సూర్య, హార్దిక్
- 5 వికెట్లతో అర్ష్దీప్ సింగ్ విజృంభణ
- 46 రన్స్ తేడాతో కివీస్ ఓటమి
- 4-1తో సిరీస్ నెగ్గిన సూర్యసేన
ఇషాన్ కిషన్ (103) మెరుపు సెంచరీకి తోడు సూర్యకుమార్ (63), హార్దిక్ పాండ్యా (42) దంచికొట్టడంతో.. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో ఇండియా 46 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇండియా 20 ఓవర్లలో 271/5 స్కోరు చేయగా.. కివీస్ 19.4 ఓవర్లలో 225 రన్స్కు ఆలౌటైంది.
తిరువనంతపురం: ఇషాన్ కిషన్ (43 బాల్స్లో 6 ఫోర్లు, 10 సిక్స్లతో 103) కెరీర్లో తొలి సెంచరీతో విజృంభించడంతో టీ20 వరల్డ్ కప్ సన్నాహకాలను టీమిండియా ఘనమైన విజయంతో ముగించింది. కిషన్కుతోడు సూర్యకుమార్ (30 బాల్స్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63), హార్దిక్ పాండ్యా (17 బాల్స్లో 1 ఫోర్, 4 సిక్స్లతో 42) దంచికొట్టడంతో.. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో ఇండియా 46 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ సాధించి సిరీస్ను 4–1తో సొంతం చేసుకుంది.
టాస్ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 271/5 స్కోరు చేసింది. ఛేజింగ్లో కివీస్ 19.4 ఓవర్లలో 225 రన్స్కు ఆలౌటైంది. ఫిన్ అలెన్ (38 బాల్స్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 80), ఇష్ సోధీ (33) పోరాడినా.. అర్ష్దీప్ సింగ్ (5/51) దెబ్బకు కివీస్ లైనప్ బెంబేలెత్తింది. ఇషాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సూర్యకుమార్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
సూర్య, పాండ్యా అండగా..
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇండియా ఇన్నింగ్స్లో ఇషాన్ భారీ షాట్లతో అలరించాడు. అభిషేక్ శర్మ (30) తొలి ఓవర్లోనే 6, 4, 4తో మెరుపు ఆరంభాన్నివ్వగా.. రెండో ఓవర్లో లోకల్ హీరో సంజూ శాంసన్ (6)ఫోర్తో టచ్లో కనిపించాడు. ఇదే ఓవర్లో అభి 4, 6 రెచ్చిపోయినా.. మూడో ఓవర్లో ఇండియాకు ఝలక్ తగిలింది. ఫెర్గుసన్ (2/41) బాల్ను షాట్ కొట్టబోయి శాంసన్ ఔటయ్యాడు. ఈ దశలో వచ్చిన ఇషాన్.. సూర్య, పాండ్యా అండతో విధ్వంసం సృష్టించాడు.
నాలుగో ఓవర్లో మరో ఫోర్ కొట్టిన అభిషేక్ను ఫెర్గూసన్ వెనక్కి పంపగా.. ఇషాన్ 4, 6తో కుదురుకున్నాడు. ఆరో ఓవర్లో సూర్య ఫోర్తో పవర్ప్లేలో ఇండియా 54/2 స్కోరు చేసింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా సూర్య, ఇషాన్ జోరును కివీస్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. సూర్య 6, 4, 6, ఇషాన్ 6, 4, 6 దంచడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 48 రన్స్ వచ్చాయి. దాంతో 102/2 స్కోరుతో ఇండియా ఫస్ట్ టెన్ ఓవర్స్ను ముగించింది. ఇక్కడి నుంచి ఇషాన్ ఆట మరో మెట్టు ఎక్కింది.
11వ ఓవర్లో సిక్స్.. 12వ ఓవర్లో 4, 4, 6, 4, 6తో 29 రన్స్ దంచాడు. ఈ క్రమంలో 28 బాల్స్లోనే ఫిఫ్టీ మార్క్ చేరాడు. అతని జోరుతో 13వ ఓవర్లోనే ఇండియా స్కోరు 150 దాటింది. తర్వాతి ఓవర్లో 4, 6, 6తో సూర్య 26 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే శాంట్నర్ (1/60) బౌలింగ్లో మరో సిక్స్ కొట్టిన సూర్య ఇంకో షాట్కు ట్రై చేసి స్టంపౌటయ్యాడు. ఫలితంగా మూడో వికెట్కు 137 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ టైమ్లో హార్దిక్ పాండ్యా సింగిల్స్తో ముందుకెళ్లినా.. ఇషాన్ మాత్రం ఆగలేదు.
జేమీసన్, శాంట్నర్ బౌలింగ్లో రెండు భారీ సిక్స్లతో 42 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అదే జోరులో 18వ ఓవర్లో భారీ షాట్కు యత్నించి డఫీకి వికెట్ ఇచ్చాడు. మధ్యలో 6, 4, 6, 6, 6 బాదిన పాండ్యాను లాస్ట్ ఓవర్లో జెమీసన్ (1/59) వెనక్కి పంపినా.. రింకూ సింగ్ (8 నాటౌట్), శివం దూబే (7 నాటౌట్) స్కోరు 270 దాటించారు. ఇండియా చివరి 10 ఓవర్లలో ఏకంగా169 రన్స్ చేయడం విశేషం.
అలెన్ మెరుపులు.. అర్ష్దీప్ దెబ్బ
ఛేజింగ్లో అలెన్ అదరగొట్టినా.. మిగతా వారు ఇండియా బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. తొలి ఓవర్లో మూడు ఫోర్లతో అలెన్ మెరుపు ఆరంభం ఇచ్చినా అర్ష్దీప్ దెబ్బకు ఆఖరి బాల్కు సిఫర్ట్ (5) వెనుదిరిగాడు. తర్వాత ఓ సిక్స్ కొట్టిన అలెన్ మూడో ఓవర్లో 4, 4, 6, 4, 4తో 23 రన్స్ రాబట్టాడు.
ఇంకోవైపు రచిన్ (30) రెండు ఫోర్లతో గాడిలో పడ్డాడు. ఆ వెంటనే అలెన్ రెండు సిక్స్లు బాదడంతో పవర్ప్లేలో కివీస్ 79/1 స్కోరు చేసింది. ఈ క్రమంలో 22 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. తర్వాతి రెండు ఓవర్లలో మరో మూడు సిక్స్లు, రెండు ఫోర్లు కొట్టిన అలెన్ను 9వ ఓవర్లో ఔట్ చేసిన అక్షర్ (3/33).. 11వ ఓవర్లో ఫిలిప్స్ (7)ను కూడా పెవిలియన్కు పంపాడు. 12వ ఓవర్లో అర్ష్దీప్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.
మూడు బాల్స్ తేడాలో రచిన్, శాంట్నర్ (0)ను ఔట్ చేయడంతో కివీస్ 137/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో డారిల్ మిచెల్ (26) కాసేపు పోరాటం చేసినా.. బేవన్ జాకబ్స్ (7), జేమీసన్ (9)నుంచి సహకారం దక్కలేదు. చివరకు 16వ ఓవర్లో అర్ష్దీప్ మళ్లీ మూడు బాల్స్ తేడాలో జేమీసన్, మిచెల్ వికెట్లు తీయడంతో కివీస్ 180/8తో వెనకబడిపోయింది. చివర్లో ఫెర్గూసన్ (3) ఔటైనా.. ఇష్ సోధీ (33), డఫీ (9 నాటౌట్) విజయాన్ని కాస్త ఆలస్యం చేశారు.
సంక్షిప్త స్కోర్లు:
- ఇండియా: 20 ఓవర్లలో 271/5 (ఇషాన్ 103, సూర్య 63, హార్దిక్ 42, ఫెర్గూసన్ 2/41).
- న్యూజిలాండ్: 19.4 ఓవర్లలో 225 ఆలౌట్ (అలెన్ 80, సోధీ 33, అర్ష్దీప్ 5/51, అక్షర్ 3/33).
- టీ20ల్లో వేగంగా 3 వేల రన్స్ (1822 బాల్స్) చేసిన బ్యాటర్ గా సూర్యకుమార్ రికార్డుకెక్కాడు. మహ్మద్ వసీమ్ (1947) ను అధిగమించాడు.
- ఇండియా తరఫున ఐదో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ (42 బాల్స్). కివీస్పై ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.
- 496 ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి వచ్చిన రన్స్. ఓ టీ20 మ్యాచ్లో రెండో అత్యధికం.
- 36 ఈ మ్యాచ్లో నమోదైన మొత్తం సిక్సర్లు. ఓ టీ20 పోరులో రెండో అత్యధికం.
