- గెలిస్తే నంబర్ 1 ర్యాంక్ టీమిండియా సొంతం
- మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో లైవ్
ఇండోర్: తొలి మ్యాచ్లో బ్యాట్తో దంచారు. రెండో పోరులో బాల్తో మెప్పించారు. ఇప్పటికే సిరీస్ పట్టారు. ఇక మిగిలింది సిరీస్ క్లీన్స్వీప్ చేయడమే. మూడో వన్డే కూడా గెలిస్తే క్లీన్స్వీప్ మాత్రమే కాదు వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ కూడా ఇండియా సొంతం అవుతుంది. దాంతో, న్యూజిలాండ్తో మంగళవారం జరిగే మూడో, చివరి మ్యాచ్లోనూ ఇండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇప్పటికే సిరీస్ నెగ్గిన నేపథ్యంలో ఈ పోరులో బౌలర్లను రొటేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో గట్టి పోటీ ఇచ్చి రాయ్పూర్లో పూర్తిగా తేలిపోయిన కివీస్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి వైట్వాష్ తప్పించుకోవాలని కోరుకుంటోంది.
మిడిలార్డర్పై ఫోకస్
హైదరాబాద్లో డబుల్లో సెంచరీ, రాయ్పూర్లో 40 రన్స్తో ఇండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. గత మ్యాచ్లో ఫిఫ్టీతో కెప్టెన్ రోహిత్ సైతం జోరందుకున్నాడు. అయితే, ఈ ఇద్దరితో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ముఖ్యంగా మిడిలార్డర్లో ఇషాన్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. శ్రీలంకపై రెండు సెంచరీల తర్వాత విరాట్ కోహ్లీ కివీస్పై ఆ స్థాయి ఆట చూపెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో చేసిన శాంట్నర్ బౌలింగ్లో ఔటై.. లెఫ్టార్మ్ స్పిన్ ఎదుర్కోవడంలో కోహ్లీ బలహీనత బయటపెట్టాడు. ఈ మ్యాచ్లో అయినా శాంట్నర్ కు కోహ్లీ కౌంటర్ ఇస్తాడేమో చూడాలి. ఇక, శ్రేయస్ అయ్యర్ స్థానంలో మిడిలార్డర్లో చోటు సంపాదించిన సూర్యకుమార్ వన్డేల్లో తన బ్యాట్ పవర్ చూపెట్టి ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇస్తే బాగుంటుంది. కేఎల్ రాహుల్ లేకపోవడంతో కీపర్గా తుది జట్టులో ఉన్న ఇషాన్ కిషన్ బాగా ఆడితేనే టీమ్లో చోటు ఉంటుందని గుర్తుంచుకోవాలి. రాయ్పూర్లో బౌలింగ్లో మెప్పించిన హార్దిక్ పాండ్యా బ్యాట్ నుంచి కూడా ఆ స్థాయి పెర్ఫామెన్స్ అవసరం ఉంది. ఇక, ఈ వారాంతంలోనే కివీస్తో టీ20 సిరీస్ స్టార్ట్ అవనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ముఖ్యమైన సిరీస్ ముందుంది. ఈ నేపథ్యంలో కొందరికి రెస్ట్ ఇచ్చి రజత్ పటీదార్ను మేనేజ్మెంట్ పరీక్షించే అవకాశం లేకపోలేదు. డొమెస్టిక్ సర్క్యూట్తో పాటు ఐపీఎల్లో రజత్ అద్భుత పెర్ఫామెన్స్ చేశాడు. ఇక, బౌలింగ్లోనూ మార్పులు జరగొచ్చు. స్పీడ్స్టర్ ఉమ్రాన్ మాలిక్ను తుది జట్టులోకి తీసుకోవడంతో పాటు కుల్దీప్ స్థానంలో చహల్ను బరిలోకి దింపే చాన్స్ ఉంది.
కివీస్కు వైట్వాష్ తప్పేనా
రాయ్పూర్లో చెత్తాటతో సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఈ పోరులో గెలిచి టీ20లకు ముందు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలని చూస్తోంది. అది జరగాలంటే ముందుగా ఆ జట్టు బ్యాటింగ్ మెరుగవ్వాలి. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండా ఆడుతున్న కివీస్ బ్యాటింగ్ లైనప్ వీక్ అయింది. రెండు మ్యాచ్ల్లోనూ ఆ టీమ్ టాప్, మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. గత 30 ఇన్నింగ్స్ల్లో ఆ టీమ్ టాప్6 బ్యాటర్లు ఏడుసార్లు మాత్రమే 40 ప్లస్ స్కోర్లు చేశారంటే ఆ టీమ్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్లో మైకేల్ బ్రేస్వెల్ ఒక్కడే రాణిస్తున్నాడు.తనకు తోడు శాంట్నర్ పోరాడుతున్నాడు. బౌలింగ్లోనూ కివీస్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక, బౌండ్రీలైన్ తక్కువగా ఉన్న హోల్కర్ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనుంది. ఇండియా బ్యాటర్లను కివీస్ ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.