- సౌతాఫ్రికా టార్గెట్ 212
- ప్రస్తుతం 101/2
- సెంచరీతో ఆదుకున్న రిషబ్
- సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా 198 ఆలౌట్
కేప్టౌన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న థర్డ్ టెస్ట్లో ఇండియా కష్టాల్లో పడ్డది. మన బ్యాటర్లు మరోసారి అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. రిషబ్ పంత్ (139 బాల్స్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 నాటౌట్) సెంచరీ పెర్ఫామెన్స్ చూపెట్టినా.. మిగతా వాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 57/2 ఓవర్నైట్ స్కోరుతో థర్డ్ డే గురువారం ఆట కొనసాగించిన ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 67.3 ఓవర్లలో 198 రన్స్కే ఆలౌటైంది. ఫలితంగా సఫారీల ముందు 212 రన్స్ టార్గెట్ను మాత్రమే ఉంచగలిగింది. దీన్ని ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆట ముగిసే టైమ్కు సెకండ్ ఇన్నింగ్స్లో 29.4 ఓవర్లలో 2 వికెట్లకు 101 రన్స్ చేసింది. కీగన్ పీటర్సన్ (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (30), మార్క్రమ్ (16) ఔటయ్యారు. ప్రస్తుతం సఫారీ జట్టు గెలవాలంటే ఇంకా 111 రన్స్ కావాల్సి ఉండగా, ఇండియాకు 8 వికెట్లు అవసరం. ఫోర్త్ డే మార్నింగ్ సెషన్లో మన బౌలర్లు విజృంభిస్తేనే ఈ మ్యాచ్లో విజయాన్ని ఆశించొచ్చు. లేదంటే సఫారీ గడ్డపై సిరీస్ విక్టరీ మళ్లీ కలగానే మిగిలిపోనున్నది.
రహానె, పుజారా ఫెయిల్
థర్డ్ డే ఆట కొనసాగించిన ఇండియాకు తొలి రెండు ఓవర్లలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓ ఎండ్లో కోహ్లీ (29) నిలకడగా ఆడినా.. పుజారా (9), రహానె (1) మళ్లీ ఫెయిలయ్యారు. లెగ్సైడ్ వెళ్లే బాల్ను అనవసరంగా టచ్ చేసిన పుజారా లెగ్ స్లిప్లో పీటర్సన్ డైవింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. ఇక రబాడ (3/53) సంధించిన టెర్రిఫిక్ లెంగ్త్ బాల్కు రహానె వద్ద ఆన్సర్ లేకపోయింది. బాల్ అలా వచ్చి ఇలా తన గ్లౌజ్ను టచ్ చేస్తూ ఫస్ట్ స్లిప్లో ఎల్గర్కు క్యాచ్గా వెళ్లింది. ఇలా 10 బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ ఔట్కావడంతో ఇండియా స్కోరు 58/4గా మారింది. ఈ దశలో వచ్చిన రిషబ్ పంత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. తన నేచురల్ గేమ్తో ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. సెకండ్ టెస్ట్లో పూర్ షాట్ సెలెక్షన్తో తీవ్ర విమర్శపాలైన పంత్ ఈసారి మాత్రం లెక్కలేసి మరీ షాట్లు కొట్టాడు. ఈ క్రమంలో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో లాంగాన్లో ఓ సూపర్ సిక్స్తో కాన్ఫిడెన్స్ పెంచుకున్నాడు. ఇక రబాడ బౌలింగ్లో కొట్టిన స్క్వేర్ కట్స్ ఇన్నింగ్స్కే హైలెట్. జాన్సెన్ (4/36) బౌలింగ్లో కొట్టిన కవర్ డ్రైవ్స్ కూడా సూపర్బ్. పంత్ ఫిఫ్టీతో ఇండియా 130/4 స్కోరుతో లంచ్కు వెళ్లింది.
పంత్ సెంచరీ..
సెకండ్ సెషన్ స్టార్టింగ్లోనే కోహ్లీ ఔటవడంతోఇండియా కంప్లీట్గా డౌన్ అయ్యింది. ఎంగిడి (3/21) వేసిన ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ను వెంటాడిన విరాట్.. సెకండ్ స్లిప్లో మార్క్రమ్కు దొరికాడు. దీంతో ఐదో వికెట్కు 94 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఇక ఇక్కడి నుంచి పంత్ ఎంత పోరాడినా.. అవతలి వైపు టీమ్మేట్స్పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో19.5 ఓవర్లలోనే ఇండియా మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. రబాడ, జాన్సెన్, ఎంగిడి అటాకింగ్ బౌలింగ్తో లోయర్ ఆర్డర్ను వణికించారు. ఫలితంగా వరుస విరామాల్లో అశ్విన్ (7), శార్దూల్ ఠాకూర్ (5) ఔటయ్యారు. పంత్ ఎక్కువగా స్ట్రయిక్ తీసుకుని ఒలివర్, మహారాజ్ను టార్గెట్ చేసి మరో మూడు సిక్సర్లు కొట్టాడు. ఉమేశ్ (0), షమీ (0), బుమ్రా (2) రన్స్ చేయకపోయినా, పంత్ సెంచరీకి సపోర్ట్ ఇచ్చారు.
స్కోర్స్
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 223
సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 210
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్: 198 (పంత్ 100*, కోహ్లీ 29, జాన్సెన్ 4/36, ఎంగిడి 3/21, రబాడ 3/53). సౌతాఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్: 101/2 (ఎల్గర్ 30, పీటర్సన్ 48 నాటౌట్).