నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా.. టెర్రరిజాన్ని అంతమొందిస్తాం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా.. టెర్రరిజాన్ని అంతమొందిస్తాం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • 11 ఏండ్ల మోదీ పాలనలో ఉగ్రదాడులు తగ్గినయ్
  • బలమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్య
  • బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: నరేంద్ర మోదీ పాలనలో ఇండియా.. నక్సల్స్ ఫ్రీ దేశంగా మారుతున్నదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 11 ఏండ్ల పాలనలో టెర్రరిస్ట్ దాడులు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. పటిష్టమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. నక్సలిజంతో పాటు టెర్రరిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడేదే లేదన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్​లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీముల వివరాలతో పుస్తకం రిలీజ్ చేశారు.  పలు సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తనది ఒడిశా అయినప్పటికీ తెలుగు భాష, కల్చర్ గురించి తెలుసని అన్నారు. ఒడిశాలోనూ తెలుగు మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారని తెలిపారు.

‘‘క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాటాను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అర్హులందరికీ పథకాలు అమలు చేస్తున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 6 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చాం. మరో 2 కోట్ల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో వ్యక్తికి ప్రతి నెలా 5 కిలోల బియ్యం ఫ్రీగా అందిస్తున్నాం. తెలంగాణలో వందల కిలో మీటర్ల రైల్వే, జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినం. కొత్త ఎయిర్​పోర్టులకు పర్మిషన్లు ఇచ్చినం. సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ, నవోదయ స్కూళ్లకు అనుమతులు ఇచ్చాం. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. దేశాభివృద్ధిలో సౌత్ ఇండియా పాత్ర ఎంతో కీలకం’’అని ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. మోదీ పాలనలో ప్రపంచంలోనే నాల్గో ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఇండియా ఎదిగిందని తెలిపారు.

ఉద్యోగ కల్పన గణనీయంగా పెరిగింది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్​తో స్టార్టప్ కంపెనీలు పెరిగాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ‘‘ఉద్యోగ కల్పన గణనీయంగా పెరిగింది. చిరు వ్యాపారులకు ముద్రా యోజన కింద రుణాలిస్తున్నాం. అగ్రికల్చర్ బడ్జెట్ ఐదింతలు పెంచినం. కిసాన్ సమ్మాన్, ఫసల్ బీమా యోజన వంటి స్కీమ్​లతో రైతులకు మేలు చేస్తున్నాం. డీ లిమిటేషన్‌‌‌‌పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది నుంచి సూడో ప్రచారం జరుగుతున్నది. ప్రజల మద్దతుతో మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. వికసిత్ భారత్ లక్ష్యంతో పని చేస్తున్నాం. పారదర్శక పాలన, ప్రజలకు లబ్ధి చేకూర్చే విధానాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం’’అని ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్ బాబు, రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమెందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీ సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు
సంగారెడ్డి, వెలుగు: సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ఎకనామిలో భారత్ అగ్రగామిగా నిలిచిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ లో గ్లోబల్ యంగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువ శాస్త్రవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ నినాదంతో భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి పరుస్తున్నాం. భారతదేశం కల్చరల్ పవర్ హౌస్ మాత్రమే కాదు.. ఎకానమీలో కూడా అగ్రగామిలో నిలిచింది” అని పేర్కొన్నారు.