సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. ఇంగ్లాండ్‎తో T20 సిరీస్‎లో టీమిండియా బోణీ

సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన.. ఇంగ్లాండ్‎తో T20 సిరీస్‎లో టీమిండియా బోణీ

నాటింగ్‌‌‌‌హామ్‌‌‌: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్‌‌‌‌జట్టు.. ఇంగ్లండ్‌‎తో ఐదు మ్యాచ్‌‎ల టీ20 సిరీస్‌‎లో బోణీ చేసింది. బ్యాటింగ్‌‎లో వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ స్మృతి మంధాన (62 బాల్స్‌‌‌‌లో 15 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 112), హర్లీన్‌‌‌‌ డియోల్‌‌‌‌ (23 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లతో 43), బౌలింగ్‌‎లో శ్రీ చరణి (4/12) చెలరేగడంతో.. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌‎లో ఇండియా 97 రన్స్‌‌‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌ను ఓడించింది. దీంతో సిరీస్‌‌‌‌లో 1–0 లీడ్‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 210/5 స్కోరు చేసింది. 

తర్వాత ఇంగ్లండ్‌‌‌‌ 14.5 ఓవర్లలో 113 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. కెప్టెన్‌‌‌‌ సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌(42 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లతో 66) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. సమయోచితంగా రాణించిన ఇండియా బౌలర్లు ఇంగ్లండ్‌‌‌‌ లైనప్‌‌‌‌ను పేకమేడలా కూల్చారు. దీంతో ఆర్లాట్‌‌‌‌ (12), బ్యూమోంట్‌‌‌‌ (10)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌‌‎లో 8 మంది సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ స్కోరుకే పరిమితం కావడంతో ఇంగ్లండ్‌‌‌‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. దీప్తి శర్మ, రాధా యాదవ్‌‌‌‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మంధానాకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మంగళవారం బ్రిస్టల్‌‎లో జరుగుతుంది. 

ఓపెనర్లు అదుర్స్‌‌‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు షెఫాలీ వర్మ (20), మంధాన ఆదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఎదుర్కొన్న తొలి బాల్‌‌‌‌ను బౌండ్రీగా మల్చిన మంధాన ఇంగ్లిష్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను చితక్కొట్టింది. రెండో ఓవర్‌‌‌‌లో  రెండు ఫోర్లు కొడితే, తర్వాతి ఓవర్‌‌‌‌లో షెఫాలీ రెండు బౌండ్రీలు రాబట్టింది. నాలుగో ఓవర్‌‌‌‌లో మూడు ఫోర్లతో మంధాన 14 రన్స్‌‌‌‌ చేయగా, తర్వాతి రెండు ఓవర్లలో 9 రన్సే వచ్చాయి. దీంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 47/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌‌‌‌లో గేర్‌‌‌‌ మార్చిన మంధాన రెండు సిక్స్‌‌‌‌లు, షెఫాలీ ఫోర్‌‌‌‌ బాదింది.

 ఆ వెంటనే మరో రెండు ఫోర్లతో మంధాన 27 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసింది. అయితే 9వ ఓవర్‌‌‌‌లో షెఫాలీ ఔట్‌‌‌‌ కావడంతో తొలి వికెట్‌‎కు 77 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఈ దశలో వచ్చిన హర్లీన్‌‌‌‌ డియోల్‌‌‌‌ కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించింది. వరుసగా నాలుగు ఫోర్లతో టచ్‌‌‌‌లోకి వచ్చింది. దాంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో ఇండియా 98/1 స్కోరుతో నిలిచింది. 11వ ఓవర్‌‌‌‌లో మంధాన సిక్స్‌‌‌‌తో మరింత జోష్‌‌‌‌ పెంచగా, 12వ ఓవర్‌‌‌‌లో డియోల్‌‌‌‌ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను వ్యాట్-హాడ్జ్ జారవిడిచింది. అయినప్పటికీ వికెట్ల మధ్య వేగంగా రన్స్‌‌‌‌ తీస్తూ రన్‌‌‌‌రేట్‌‌‌‌ను పెంచారు.

14, 15వ ఓవర్‌‌‌‌లో మంధాన నాలుగు ఫోర్లు కొట్టడంతో స్కోరు 160/1కి పెరిగింది. 16వ ఓవర్‌‌‌‌లో రెండు ఫోర్లు కొట్టిన మంధాన 51 బాల్స్‌‌‌‌లో సెంచరీ అందుకుంది. టీ20ల్లో ఆమెకు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. కానీ ఇదే ఓవర్‌‌‌‌లో డియోల్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడంతో రెండో వికెట్‌‌‌‌కు 94 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. మూడు ఫోర్లతో ఖాతా తెరిచిన రిచా ఘోష్‌‌‌‌ (12)తో పాటు జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (0)ను 18వ ఓవర్‌‌‌‌లో లారెన్‌‌‌‌ బెల్‌‌‌‌ (3/27) పెవిలియన్‌‌‌‌కు పంపింది. లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో మరో ఫోర్‌‌‌‌ కొట్టి మంధాన ఔటైనా స్కోరు రెండొందలు దాటింది. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 210/5 (మంధాన 112, హర్లీన్‌‌‌‌ డియోల్‌‌‌‌ 43, లారెన్‌‌‌‌ బెల్‌‌‌‌ 3/27). ఇంగ్లండ్‌‌‌‌: 14.5 ఓవర్లలో 113 రన్స్‌‌‌‌ ఆలౌట్‌‌‌‌ (సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌ 66, శ్రీ చరణి 4/12).