
డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక రేటుతో రికార్డ్
గార్డ్నర్, సివర్కు చెరో రూ. 3.2 కోట్లు, దీప్తి శర్మకు 2.6 కోట్లు
రూ. 1.8 కోట్లకే ముంబై సొంతమైన హర్మన్ప్రీత్
ముంబై : తన ధనాధన్ బ్యాటింగ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఇండియా విమెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జాక్పాట్ కొట్టింది. ఐపీఎల్లో మెన్స్ ప్లేయర్లకు తీసిపోని రీతిలో విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ ఆక్షన్లో కోట్లు కొల్లగొట్టింది. ఏకంగా 3 కోట్ల 40 లక్షలు దక్కించుకొని ఔరా అనిపించింది. సోమవారం ముంబైలో జరిగిన వేలంలో మొదటి పేరుగా వచ్చిన మంధానను ఆర్సీబీఅత్యధిక రేటుతో సొంతం చేసుకుంది. ఈ స్టార్ బ్యాటర్ కోసం ముంబై ఇండియన్స్ సైతం పోటాపోటీగా బిడ్ వేసింది. పట్టువదలని ఆర్సీబీ ఆమె కోసం తమ వద్ద ఉన్న మొత్తంలో 30 శాతంపైనే ఖర్చు చేసి ఆశ్చర్యపరిచింది.
ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్లో ఎంఎస్ ధోనీ అత్యధికంగా రూ. 9.5 కోట్లు పలకగా... డబ్ల్యూపీఎల్ వేలం టాపర్గా మంధాన చరిత్రలో నిలిచింది. ఆమె తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆష్లే గార్డ్నర్, ఇంగ్లండ్ ఆల్రౌండర్ నటాలీ సివర్ చెరో రూ. 3.2 కోట్లతో రెండో అత్యధిక ధర పలికిన ప్లేయర్లుగా నిలిచారు. గార్డ్నర్ను గుజరాత్ జెయింట్స్, సివర్ను ముంబై ఇండియన్స్ తీసుకున్నాయి. ఇక, ఇండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు మంధానతో పోలిస్తే సగమే వచ్చింది. ఆమెను రూ. 1.8 కోట్లతో ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఇండియా ప్లేయర్లలో సెకండ్ బెస్ట్గా ఆల్రౌండర్ దీప్తి శర్మ నిలిచింది. రూ. 2.6 కోట్లతో ఆమెను యూపీ వారియర్స్ టీమ్ దక్కించుకుంది. ఈ ఆక్షన్లో ఐదు ఫ్రాంచైజీలు రూ. 59.5 కోట్లు ఖర్చు చేసి 87 మందిని కొనుగోలు చేశాయి. వీరిలో ముగ్గురు మూడు కోట్లు, మరో నలుగురు రెండు కోట్ల పైచిలుకు దక్కించుకున్నారు.
ఇండియన్స్కు మొగ్గు
వేలంలో ఐదు ఫ్రాంచైజీలు ఇండియా స్టార్స్కే మొగ్గు చూపాయి. అత్యధిక రేటు దక్కిన తొలి పది మందిలో ఆరుగురు ఇండియన్సే ఉన్నారు. కనీసం కోటి దాటిన 20 మందిలో సగం ఇండియా ప్లేయర్లే ఉండటం గమనార్హం. ఆదివారం రాత్రి పాకిస్తాన్ టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో మెరుపు ఫిఫ్టీతో చెలరేగిన బ్యాటర్ జెమీమాను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ షెఫాలీ వర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు వెచ్చించింది. కీపర్ రిచా ఘోశ్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ (ముంబై) చెరో రూ. 1.9 కోట్లు దక్కించుకున్నారు. ఇండియా ప్లేయర్లలో. యస్తికా భాటియా (రూ. 1.5 కోట్లు, ముంబై), రేణుకా ఠాకూర్ (రూ. 1.5 కోట్లు, ఆర్సీబీ, దేవికా వైద్యా (రూ. 1.4 కోట్లు, యూపీ) కోటి దాటారు. ఇక, ఫారినర్స్లో బెత్ మూనీ (రూ. 2 కోట్లు, గుజరాత్), సోఫీ ఎకిల్స్టోన్ (రూ. 1.8 కోట్లు, యూపీ), ఎలైస్ పెర్రీ (రూ. 1.7 కోట్లు, ఆర్సీబీ), మరిజానె కాప్ (రూ. 1.5 కోట్లు, ఢిల్లీ) భారీ రేటు దక్కించుకోగా.. ఆసీస్ బ్యాటర్ మెగ్ లానింగ్ను ఢిల్లీ రూ. 1.10 కోట్లకే సొంతం చేసుకుంది.
మన అరుంధతి, యశశ్రీకి చాన్స్
వేలంలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లకు అవకాశం లభించింది. ఇండియా పేసర్, హైదరాబాదీ అరుంధతి రెడ్డి రూ. 30 లక్షల బేస్ ప్రైజ్కు ఢిల్లీకి ఎంపికైంది. అండర్19 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ అయిన మరో హైదరాబాదీ ఎస్. యశశ్రీ రూ. 10 లక్షలకు యూపీ టీమ్లో చోటు దక్కించుకుంది. ఏపీకి చెందిన అంజలి రూ.55 లక్షలతో యూపీకి ఎంపికవగా.. మేఘన (రూ. 30 లక్షలు, గుజరాత్), స్నేహదీప్తి (రూ. 30 లక్షలు, ఢిల్లీ), షబ్నమ్ (రూ. 10 లక్షలు, గుజరాత్) లీగ్లో చాన్స్ కొట్టేశారు.