వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం

వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం

భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ల డీల్ లో భాగంగా.. తొలి చాపర్ ను అరిజోనా తయారీ కేంద్రంలో భారత్ కు అప్పగించింది అమెరికా. అపాచీ గార్డియన్ హెలికాప్టర్ల ఒప్పందంలో భాగంగా 22 హెలికాప్టర్లను అమెరికా భారత్ కు అందించాల్సి ఉంది. ఇందులో తొలి హెలికాప్టర్ భారత్ చేతికి చేరింది. ఆధునిక యుద్ధ శ్రేణి గార్డియన్ హెలికాప్టర్ల డీల్ కోసం 2.2 బిలియన్ డాలర్లను భారత్ వెచ్చిస్తోంది. 2015లో ఈ డీల్ కుదిరింది. వీటితో పాటే 15 చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ డీల్ కూడా కుదుర్చుకుంది.

చినూక్ ఇప్పటికే భారత వాయుసేనకు అందింది. అపాచీ గార్డియన్ హెలికాప్టర్లకు చాలా ప్రత్యేకతలున్నాయి. గంటకు 365 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వీటిలో బాంబులను ప్రయోగించేందుకు అన్ని అత్యాధునిక వ్యవస్థలున్నాయి. శత్రుస్థావరాలు, బంకర్లను ధ్వంసం చేసే శక్తి ఈ హెలికాప్టర్లకు ఉంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎదురుదాడి చేయగల సత్తా ఈ హెలికాప్టర్ల సొంతం. చాలా వరకు సైనిక ఆపరేషన్స్ కు ఈ హెలికాప్టర్లనే అమెరికా వినియోగిస్తోంది.