
- 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ
- వివరాలు వెల్లడించిన కర్నల్ సోఫియా ఖురేషీ
- ఆలయాలు, ఆస్పత్రులేలక్ష్యంగా పాకిస్తాన్ దాడులు
- భుజ్, పఠాన్కోట్, భటిండా ఎయిర్ స్టేషన్లపై మిసైల్స్
- తిప్పికొట్టిన భారత సైన్యం
- ఎస్400 ధ్వంసం చేసినట్టు పాక్ ఫేక్ ప్రచారం
- భారత్లో ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడి
న్యూఢిల్లీ: పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత స్థావరాలపై దాడులు చేసిందని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత ఆర్మీ పేర్కొన్నది. పాకిస్తాన్లోని 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. ఇందులో ఆయుధ డిపో, కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయని పేర్కొన్నది. భారత్-–పాక్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలపై శనివారం కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు విదేశాంగశాఖ, మిలిటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. సోఫియా ఖురేషీ మాట్లాడుతూ.. పశ్చిమ సరిహద్దుల్లో పాక్ నిరంతరం దాడులు చేసిందని, డ్రోన్లు, లాంగ్రేంజ్ వెపన్స్, ఫైటర్ జెట్లతో ఇండియన్ మిలిటరీ స్థావరాలపై అటాక్ చేసిందని చెప్పారు. వాటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టిందని వివరించారు. మొత్తం 26 చోట్ల పాక్ వెపన్స్ గగనతలంలోకి చొచ్చుకొచ్చాయని, అవి ఉధంపూర్, భుజ్, పఠాన్కోట్, భటిండా ఎయిర్స్టేషన్స్లోని పరికరాలను దెబ్బతీశాయని వెల్లడించారు. ఈ దాడిలో పలువురు సిబ్బందికూడా గాయపడ్డట్టు చెప్పారు. ‘‘తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో పాక్ హైస్పీడ్ మిసైల్స్తో పంజాబ్లోని ఎయిర్ఫోర్స్ స్థావరాలపై దాడులు చేసింది. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్లో మెడికల్సెంట్రల్స్పై అటాక్ చేసింది” అని ఖురేషీ వెల్లడించారు.
పౌరులకు హాని కలగకుండా దాడులు చేశాం
పాక్కవ్వింపు చర్యలకు భారత ఆర్మీ దీటుగా సమాధానం ఇచ్చిందని కర్నల్ ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్లోని రఫికీ, చక్లాలా, రహీం యార్ఖాన్, సుక్కుర్, చునియన్లోని సైనిక స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై అత్యంత కచ్చితత్వంతో దాడిచేసినట్టు పేర్కొన్నారు. ఫైటర్ జెట్లతో అత్యంత కచ్చితంగా టార్గెట్స్ ఛేదించే ఆయుధాలు వాడి ఈ దాడులు నిర్వహించామని, పౌరుల ప్రాణాలు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. పాక్లోని ప్రార్థనా స్థలాలను తాము టార్గెట్ చేయలేదని వెల్లడించారు. ఎల్ఓసీ వద్ద పాక్కు భారీ నష్టం జరిగిందని తెలిపారు. అలాగే, పస్రూర్లో రాడార్ కేంద్రం, సియోల్ కోట్లోని ఏవియేషన్ బేస్ను ధ్వంసం చేసినట్టు వివరించారు. కాగా, ఇవే విషయాలను వ్యోమికా సింగ్ ఇంగ్లిష్లో ఇంటర్నేషనల్మీడియాకు వివరించారు. మిస్రీ మాట్లాడుతూ.. భారత్లోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు, సైబర్ వ్యవస్థలు మొదలైన వాటిపై దాడి చేసి, నాశనం చేశామని పాక్అసత్యాలు ప్రచారం చేసిందని, ఇవి పూర్తిగా అబద్ధం అని వెల్లడించారు. శిర్సా, సూరత్ఘర్ ఎయిర్స్టేషన్లు సేఫ్గానే ఉన్నాయని తెలిపారు. ఎస్-400 , బ్రహ్మోస్ మిసైల్ డిపో, పలుచోట్ల ఎయిర్ఫీల్డ్లను ధ్వంసం చేసినట్లు ఫేక్ప్రచారాలకు పాల్పడిందని అన్నారు. ప్రజలు వీటిని నమ్మొద్దని, పాక్ చెప్పినట్టు భారత్లో ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు.
శ్రీనగర్లో మరోసారి భారీ పేలుళ్లు
శ్రీనగర్లో శనివారం ఉదయం మరోసారి పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. దాల్ లేక్లో ఒక మిస్సైల్ లాంటి వస్తువు పడినట్టు అధికారులు తెలిపారు. నీటి ఉపరితలంపై దట్టమైన పొగ కమ్ముకుందని పేర్కొన్నారు. ఆ శిథిలాలను సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. అదే సమయంలో శ్రీనగర్ శివారులోని లస్జన్ ప్రాంతంలోనూ మరో అనుమానాస్పద వస్తువు లభ్యమైంది. దానిని కూడా విశ్లేషణ కోసం అధికారులు తీసుకెళ్లారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో, ఆర్మీ ఎయిర్ఫీల్డ్ వద్ద కూడా పేలుళ్ల శబ్ధం వినిపించింది. మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ సమీపంలో సంభవించిన పేలుళ్లు స్థానికంగా భయాందోళనలను పెంచాయి.