భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ

భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ

చైనా, భారత సైనికుల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇందులో భాగంగా ఇరువర్గాల సైనికులు ఒకరిని మరొకరు తోసుకున్నారు. అయితే ఉన్నతాధికారుల చర్చలతో  ఈ ఘర్షణాత్మక సమస్య కాస్తా సద్దుమణిగింది. ఈ ఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో జరిగింది. తూర్పు లడఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు దగ్గర భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.

త్వరలోనే ఇక్కడ భారత ఆర్మీ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టనుండటంతో ఈ కార్యక్రమం నిర్వహించాయి. అయితే భారత ఆర్మీ పెట్రోలింగ్  చేస్తుండగా  చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయంపై రెండు దేశాలకు సంబంధించిన బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ ఉన్నతాధికారులు చర్చలు జరపడంతో సమస్య ఒక్కరోజులోనే పరిష్కారమైంది.

లడఖ్, టిబెట్ మధ్య ఉన్న పాంగాంగ్ సరస్సు తమదంటే, తమదని భారత్, చైనా దేశాలు పట్టుబడుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సరిహద్దు లేకపోవడం, ప్రస్తుతం ఉన్న వాస్తవాధీన రేఖ(LOC) ను చైనా గుర్తించక పోవడంతో భారత్, చైనా సైన్యాల మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.