తెలంగాణలో 3 పట్టణాలకు ఐఎస్ఎల్ అవార్డులు

తెలంగాణలో 3 పట్టణాలకు ఐఎస్ఎల్ అవార్డులు

తెలంగాణ‌లోని 3 పట్టణాలకు ‘ఇండియన్‌ స్వచ్ఛత లీగ్’ అవార్డులు వరించాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అలంపూర్‌, కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్‌ స్వచ్ఛత లీగ్ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు అవార్డులు అందుకున్నారు. 

గార్బెజ్ ఫ్రీ సిటీస్‌లో భాగంగా ఇండియ‌న్ స్వచ్ఛత లీగ్ అవార్డులను అందించారు. ఇందులో 15వేల లోపు జ‌నాభా ఉన్న ప‌ట్టణాల కేట‌గిరీలో అలంపూర్ ప‌ట్టణం ఎంపికైంది. 25 నుంచి 50 వేల వ‌ర‌కు జ‌నాభా ఉన్న ప‌ట్టణాల విభాగంలో ఫిర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, 50 వేల నుంచి ల‌క్ష జ‌నాభా ఉన్న కేట‌గిరీలో కోరుట్ల ప‌ట్టణాలు ఎంపిక‌య్యాయి. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ, వరంగల్, హైదరాబాదు పట్టణ పరిపాలన శాఖ ప్రాంతీయ డైరెక్టర్లు, ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణ, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ అయాజ్, అలంపూర్ మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ పాల్గొన్నారు.