కరోనా బాధితుల ఆకలి తీర్చేందుకు చలో గివ్ క్యాంపెయిన్

కరోనా బాధితుల ఆకలి తీర్చేందుకు చలో గివ్  క్యాంపెయిన్
  • 6 లక్షల యూఎస్ డాలర్లు సమీకరించిన ఇండియాస్పోరా

వాషింగ్టన్: కరోనా వైరస్ ఎఫెక్టుతో తిండి దొరకని వారికి సాయం చేసేందుకు యూఎస్ లోని ఇండిస్పోరా ‘చలో గివ్ కొవిడ్–19’ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే 5 లక్షల డాలర్ల విరాళం సమీకరించినన ఇండియాస్పోరా శుక్రవారం నుంచి చలో గివ్ ప్రచారానికి మరో లక్ష డాలర్లు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియా, యూఎస్ లో కరోనా బాధితుల కోసం ఈ సాయాన్ని అందించనున్నట్లు ఇండియాస్పొరా ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. టాప్ ఇండియన్ అమెరికన్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, లీడర్ల నుంచి ఈ మొత్తాన్ని సేకరించినట్లు తెలిపారు.

ఆకలి తీర్చడమే అతిపెద్ద సవాలు

‘కరోనా ఎఫెక్టుతో ప్రస్తుతం అమెరికా, ఇండియా ఎదుర్కొంటున్న అత్యవసర సవాళ్లలో ఆకలి ఒకటి. ఇండియాస్పోరా సేకరించిన డబ్బుతో ఈ రెండు దేశాల్లో కరోనా ఎఫెక్టు బారిన పడినవారి ఆకలి బాధలు తీర్చాలని ఇండియాస్పోరా నిర్ణయించింది’ అని సిలికాన్ వ్యాలీకి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ ఆనంద్ రాజరామన్, ఇండియాస్పోరా సర్కిల్ సభ్యుడు..అతని భార్య కౌషీ ఆదిశేశన్‌తో కలిసి మీడియాకు వివరించారు. కరోనా వైరస్ బాధితులతో సమానంగా ప్రపంచం అంతటా లక్షలాది మంది తిండిలేక అలమటిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. కరోనా మహమ్మారి సాధారణ కుటుంబాలను విపరీతమైన పేదరికంలోకి నెట్టే ప్రమాదం ఉందన్నారు. వారందరికీ సాయం చేసేందుకు చలో గివ్ ప్రచారం ఉపయోగపడుతుందని, ప్రజలకు ఆహారం అందించేందుకు ఇండియాస్పోరా పిలుపునిచ్చిందని చెప్పారు. చలో గివ్ ప్రచారానికి పెప్సికో సీఈవో ఇంద్రనూయి, నందన్ నీలేకని, బాలీవుడ్ నటి నందితా దాస్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అన్షు గుప్తా, ఫీడింగ్ అమెరికా సీఈవో బాబినాక్స్-ఫాంటెనోట్ తదితరులు మద్దుతు ఇచ్చారు.