ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లింతోయ్ చనంబంకు స్వర్ణం

 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లింతోయ్ చనంబంకు స్వర్ణం

భారత జూడో ప్లేయర్ లింతోయ్ చనంబం చరిత్ర సృష్టించింది. 16 ఏళ్లకే ప్రపంచం జూడో చాంపియన్గా అవతరించింది. సారాజెవోలో జరిగిన క్యాడెట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 57 కిలోల విభాగంలో లింతోయ్ చనంబం స్వర్ణం సాధించింది. బ్రెజిల్‌కు చెందిన బియాంకా రీస్‌ను 1-0తో  ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో తొలిసారిగా స్వర్ణం సాధించిన ఏకైక భారత జూడో ప్లేయర్గా లింతోయ్ చనంబం చరిత్ర సృష్టించింది. 

SAI ప్రశంసలు..
లింతోయ్ చనంబం స్వర్ణ పతకం సాధించడంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రశంసలు కురిపించింది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన మొట్టమొదటి భారత జూడో క్రీడాకారిణి లింతోయ్ అని మెచ్చుకుంది. ఆసియా ఛాంపియన్ అయిన లింతోయ్..57కిలోల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బియాంకా రీస్‌ను 1-0 తేడాతో ఓడించి క్యాడెట్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2022లో గెలుపొందింది ” అని SAI మీడియా ట్వీట్ చేసింది.

ఆసియా ఛాంపియన్..
లింతోయ్ చనంబం  2018లో సబ్-జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి స్వర్ణం సాధించింది.  ఆ తర్వాత నవంబర్ 2021లో చండీగఢ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లోనూ గోల్డ్ గెలిచింది. దీని తర్వాత జూలై 2022లో జరిగిన ఆసియా క్యాడెట్,  జూనియర్ జూడో ఛాంపియన్‌షిప్‌లలో మరో పసిడి పతకం దక్కించుకుంది. 2018లో సబ్-జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలుచుకున్న తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి వరుసగా స్వర్ణం పతకాలను సాధిస్తూ వస్తోంది. తాజాగా  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.