రోజూ కొవిడ్ కేసుల వివరాలను వెల్లడిస్తుండడంతో జనాలు భయపడుతున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొంది. కేసుల డేటాను రహస్యంగా ఉంచాలని, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కొవిడ్ కట్టడిలో భాగమైన ప్రతి డాక్టర్ నమ్మదగిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలని, తద్వారా జనాల్లో ధైర్యం నింపి నమ్మకం కలిగించాలని సూచించింది. చైనాలో ఉన్నతాధికారుల హంగామా వల్లే ప్రపంచమంతా కరోనాపై భయం కమ్ముకుందని చెప్పింది. అయితే, కేంద్ర ప్రభుత్వం కరోనాపై బ్యాలెన్స్డ్ చర్యలు తీసుకుంటోందని చెప్పింది. వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలూ బాగున్నాయని, ఒత్తిడిని తట్టుకుని పనిచేస్తున్నాయంది. టీబీ (క్షయ) వంటి జబ్బులను గుర్తించడానికి కొవిడ్ను అవకాశంగా మలచుకోవాలని, అంతేగాకుండా చేతులను కడుక్కోవడం ఎంత ముఖ్యమో జనాల్లో అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
62కు పెరిగిన కేసులు
దేశంలో బుధవారం సాయంత్రానికి కొవిడ్ కేసులు 62కు పెరిగాయి. జైపూర్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీల్లో తాజాగా కేసులు నమోదయ్యాయి. కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 85 ఏళ్ల వృద్ధురాలి పరిస్థితి సీరియస్గా ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటిదాకా నమోదైన కొవిడ్ కేసులు 50 మాత్రమేనని కేంద్రం చెబుతోంది. పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల నుంచి టైంకు డేటా అందకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కేసుల సంఖ్యలో తేడాలుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. కొవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వాళ్లు ఇంట్లోనే ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. చైనా, ఇటలీ, ఇరాన్, కొరియా, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ వంటి దేశాలకు వెళ్లకపోవడమే మంచిదని పేర్కొంది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలేవో చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మార్చి 30 లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే స్కూళ్లు బంద్పెట్టిన లడఖ్.. ఇప్పుడు కాలేజీలకూ ఆ సెలవులను పొడిగించింది. ఇటు శ్రీనగర్లోనూ అన్ని విద్యా సంస్థలు, స్టేడియాలను బంద్పెడుతూ జమ్మూకాశ్మీర్ ఆదేశాలిచ్చింది. కొవిడ్ నేపథ్యంలో తమకు బ్రీత్ అనలైజర్ టెస్టుల నుంచి మినహాయింపునివ్వాలని ఎయిరిండియా పైలట్లు డీజీసీఏని కోరారు. ఈ మేరకు డీజీసీఏ చీఫ్కు లెటర్ రాశారు. ఇంటర్నేషనల్ విమానాలను నడిపే పైలట్లకు ఈ టైంలో బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. డెల్, మైండ్ట్రీ కంపెనీలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్ వచ్చినట్టు కంపెనీలు చెప్పాయి.
ఇటలీ నుంచి 135 మంది వచ్చిన్రు
కొవిడ్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఇటలీ నుంచి 135 మంది ఇండియన్లు సొంత దేశానికి తిరిగొచ్చేశారు. 83 మంది ఎయిరిండియా ఫ్లైట్ మనేసర్కు రాగా అందరినీ అక్కడి ఆర్మీ ఫెసిలిటీలో క్వారెంటైన్ చేశారు. మరో 52 మంది కేరళలోని కొచ్చిన్కు చేరుకున్నారు. 35 మందిని అళువా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో క్వారెంటైన్ చేశారు. అందులో ఇద్దరు పిల్లలతో పాటు ఇద్దరు గర్భిణులున్నారు.
అందరినీ తీసుకొచ్చేస్తం
ఇటలీ, ఇరాన్లలో చిక్కుకున్న ఇండియన్లందరినీ తిరిగి తీసుకొచ్చేస్తామని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చెప్పారు. ఆయా దేశాల్లో చిక్కుకున్న ఇండియన్లకు టెస్టులు చేసేందుకు మెడికల్ టీం గురువారం వెళుతుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంటున్న ఇండియన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తే, జనాల్లో లేనిపోని భయాలు సృష్టించినట్టవుతుందని ఆయన చెప్పారు. ఇరాన్లో 6 వేల మందికిపైగా చిక్కుకున్నారన్నారు. మంగళవారం ఇరాన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన 58 భక్తులకు కొవిడ్ లేదన్నారు. ఇరాన్ నుంచి తెచ్చిన 529 శాంపిళ్లను పుణేలోని ఎన్ఐవీ టెస్ట్ చేస్తోందని, అందులో 107 నెగెటివ్ వచ్చాయన్నారు. చెన్నైలో దక్షిణ కొరియా వాళ్లను ఇంటి ఓనర్లు ఖాళీ చేయిస్తున్నారు.
ఇటలీలో సీరియస్
ఇటలీలో రోజురోజుకూ కొవిడ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ 10,149 కేసులు నమోదవగా, 631 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 1,21,487 కేసులు నమోదవగా, 4,382 మంది చనిపోయారు. చైనాలో 80,788 కేసులు నమోదయ్యాయి. 3,158 మంది చనిపోయారు. ఇరాన్లో 9 వేల కేసులు, 354 మరణాలు నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో 61 మంది, స్పెయిన్లో 49, ఫ్రాన్స్లో 33, జపాన్లో 12 మంది చనిపోయారు. అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 31కి పెరిగింది. 1,016 కేసులు నమోదయ్యాయి.