హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్టాండ్ దగ్గరలోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. టీజీఎస్ ఆర్టీసీకి పెండింగ్లో ఉన్న రూ. 2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని మాల్ యాజమాన్య సంస్థ విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను కోర్టు శనివారం ఆదేశించింది. లేదంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని టీజీఎస్ ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. భవిష్యత్లోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే మాల్ను స్వాధీనం చేసుకోవచ్చని చెప్పింది.
మాల్ రీఓపెన్కు ఓకే..
ఆ షాపింగ్ మాల్లోని సబ్ లీజు దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్ను ఓపెన్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో మాల్ను తెరిచేందుకు ఆర్టీసీ అనుమతిచ్చింది. వారం రోజుల్లోగా బకాయిలు చెల్లించకపోతే కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.