
- నేవీ ఆపరేషన్ పై ఆసక్తికర కథనం
- బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత సముద్రంలోనూ టెన్షన్
న్యూఢిల్లీ: దాని పేరు పీఎన్ఎస్ సాద్. పాకిస్థాన్ అమ్ములపొదిలోని అతి భారీ సబ్మెరైన్. ‘హంటర్ కిల్లర్’గానూ వ్యవహరించే ఆ(ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్) సబ్మెరైన్.. మిగతా వాటికంటే ఎక్కువ సేపు నీటి అడుగుభాగంలో ఉండగలదు. కాబట్టే మనోళ్లు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. అయితే, ఫిబ్రవరిలో బాలాకోట్పై ఎయిర్ఫోర్స్ దాడుల తర్వాత పీఎన్ఎస్ సాద్ సడన్గా మాయమైపోయింది. అదిగానీ ఇండియావైపుకొస్తే (కరాచీ నుంచి) రెండ్రోజుల్లో గుజరాత్ తీరాన్ని, ఐదు రోజుల్లో మహారాష్ట్ర తీరాన్ని చేరే అవకాశముండేది. పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత త్రివిధ దళాలూ దాదాపు యుద్ధసన్నద్ధతలో ఉన్నందున, పాక్ అలాంటి దుస్సాహసానికి ఒడిగట్టలేదు. కానీ సాద్ జాడ మాత్రం మనోళ్లకు మిస్టరీగా మారింది. కనిపించకుండా పోయిన పాక్ సబ్మెరరైన్ కోసం మనోళ్లు తీవ్రంగా గాలించారు. న్యూక్లియర్ సబ్మెరైన్ చక్ర, కొద్దిరోజుల కిందటే జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ కల్వరితోపాటు అందుబాటులో ఉన్న అన్ని సబ్మెరైన్లనూ రంగంలోకి దింపారు. రోజురోజుకూ సెర్చ్ ఏరియాను విస్తరిస్తూ పోయారు. చివరికి 21 రోజుల తర్వాత.. కరాచీకి అవతలిదిక్కుగా పీఎన్ఎస్ సాద్ను ఇండియన్ నేవీ గుర్తించగలిగింది. బాలాకోట్ దాడుల తర్వాత సముద్రంలో చోటుచేసుకున్న టెన్షన్కు సంబంధించిన కథనం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత ఇండియన్ నేవీ సుమారు 60 యుద్ధనౌకల్ని అరేబియా సముద్రంలో మోహరింపజేయడం, ఆ వెంటనే బాలాకోట్పై ఎయిర్స్ట్రైక్స్ చేయడం తెలిసిందే. మన దూకుడు చూశాక భయంతో పాక్ తన సాద్ సబ్మెరైన్ను దాచిపెట్టిఉంటుందని నేవీ అధికారులు అభిప్రాయపడ్డారు.