న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ మరోసారి సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టించింది. కొచ్చి నుంచి దాదాపు 700 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఓ ఇరాన్ చేపల బోటును కాపాడింది. బందీలుగా చిక్కుకున్న 17 మంది సిబ్బందిని సురక్షితంగా విడిపించింది. ‘‘హైజాక్ సమాచారం అందుకున్న వెంటనే.. ఏడెన్ జలసంధి, సోమాలియా తూర్పు తీరం వెంబడి విధుల్లో ఉన్న ‘ఐఎన్ఎస్ సుమిత్ర’ రంగంలోకి దిగింది.
బోటును అడ్డుకుని, హెలికాప్టర్ల ద్వారా చుట్టుముట్టి.. సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేసింది. పడవతో పాటు సిబ్బందిని రక్షించింది’’ అని భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల కాలంలో అరేబియా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సముద్ర గస్తీని భారీ స్థాయిలో పెంచింది. ఇటీవల హూతీల దాడుల్లో మంటల్లో చిక్కుకుపోయిన ఓ బ్రిటన్ నౌకను ఆదుకున్న ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’.. అందులోని 22 మంది భారతీయులు, ఇద్దరు శ్రీలంక దేశస్తులను కూడా రక్షించింది.