న్యూఢిల్లీ: ఇండియన్ ఫార్మా కంపెనీలకు స్వదేశంతోపాటు మొత్తం ప్రపంచం కోసం కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చెప్పారు. ‘అనేక ముఖ్యమైన విషయాలు ఇండియాలో జరుగుతున్నాయి. ఆ దేశ ఫార్మా ఇండస్ట్రీ చాలా మెరుగ్గా పని చేస్తోంది. ఇతర వ్యాధులలాగే కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో వారు కష్టపడుతున్నారు. ఇండియాకు చాలా సామర్థ్యం ఉంది. ప్రపంచానికి పెద్ద మొత్తంలో మందులను అందించే డ్రగ్, వ్యాక్సిన్ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. మరెక్కడా లేని విధంగా ఇండియాలో చాలా వ్యాక్సిన్స్ను డెవలప్ చేశారు. ఇందులో సీరం ఇన్స్టిట్యూట్ చాలా పెద్దది. దీంతోపాటు బయో ఈ, భారత్ బయోటెక్ ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ను తీసుకురావడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. మిగిలిన వ్యాధులకు కష్టపడిన మాదిరే కరోనా వ్యాక్సిన్ కోసం కూడా శ్రమిస్తున్నారు’ అని ఓ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ బిల్ గేట్స్ పేర్కొన్నారు.
‘ఇండియాలోని ఫార్మా కంపెనీలు తమ దేశానికే గాక మొత్తం ప్రపంచానికి వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొస్తాయని నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. మరణాలు తగ్గించడమే మన పని. అలాగే మనం ఇమ్యూన్ (రోగ నిరోధకులం) అని నిరూపించాలి. అప్పుడే మహమ్మారిని అంతం చేయగలం. ఇండియా చాలా పెద్ద దేశం. ఇక్కడి నగరాల్లో చాలా మంది ప్రజలు నివసిస్తుంటారు. వాళ్లు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. ప్రజలు బయటకు వస్తున్నందున వ్యాప్తిని ఎలా అడ్డుకోగలం, ఆహారాన్ని అందుబాటులో ఉంచడం, అవసరమైన ఎక్విప్మెంట్ను అవేలబుల్గా ఉంచుకోవడమే కీలకం’ అని బిల్ గేట్స్ చెప్పారు.