ఫుల్లర్టన్ (యూఎస్ఏ): భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ జపాన్కు చెందిన యుదాయ్ ఒకిమోటోపై విజయం సాధించి, ఈ సీజన్లో తన మొదటి ఫైనల్కు అర్హత సాధించాడు.
72 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 22– -20, 15– -21, 21– -19 తేడాతో ప్రపంచ 33వ ర్యాంకర్ ఒకిమోటోపై చెమటోడ్చి గెలిచాడు. ఆదివారం జరగబోయే టైటిల్ పోరులో ప్రపంచ 46వ ర్యాంకర్, చైనీస్ తైపీ ఆటగాడు సు లీ యాంగ్తో శ్రీకాంత్ తలపడనున్నాడు.
ప్రస్తుతం ప్రపంచ 38వ ర్యాంక్లో ఉన్న శ్రీకాంత్.. తొలి గేమ్లో ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించి, 17– -10తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే ఒకిమోటో అనూహ్యంగా పుంజుకుని వరుస పాయింట్లతో గేమ్ పాయింట్కు చేరుకున్నాడు. ఆ దశలో అప్రమత్తమైన శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో ఒకిమోటో 21– -15 పాయింట్లతో మ్యాచ్ను మూడో గేమ్కు చేర్చాడు.
ముగిసిన రౌనక్, దేవికల పోరు..
మరో సెమీ ఫైనల్లో భారత్కే చెందిన యువ షట్లర్ రౌనక్ చౌహాన్ అద్భుత ప్రదర్శన ముగిసింది. తన తొలి సూపర్ 300 టోర్నమెంట్లో సెమీస్ చేరిన రౌనక్.. చైనీస్ తైపీకి చెందిన సు లీ యాంగ్ చేతిలో 17– -21, 19 –-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. మరోవైపు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో దేవిక సిహంగ్ కూడా ఓటమి పాలయ్యింది. డెన్మార్క్కు చెందిన లీన్ క్రిస్టోఫర్సన్ చేతిలో 21– -15, 11– -21, 15 –-21 తేడాతో ఓడిపోయింది.
