
న్యూఢిల్లీ: ఇండియా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చైనా షాకిచ్చింది. రేర్ ఎర్త్ మాగ్నెట్స్ (అరుదైన మినరల్స్తో తయారు చేసే అయస్కాంతం) చైనా నుంచి దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. దీంతో చాలా వెహికల్ కంపెనీలు తమ ప్రొడక్షన్ను తగ్గించేశాయి. రేర్ ఎర్త్ మాగ్నెట్స్ను ప్యాసింజర్ కార్లు, గృహోపకరణాలు, క్లీన్ ఎనర్జీ వంటి చాలా రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, లోకల్ సప్లయర్లు చైనాలోని తమ వెండర్ల ద్వారా చైనా ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ కోరారు. కానీ ఇప్పటివరకు ఒక్క అప్రూవల్ కూడా రాలేదు.
చైనా ఈ మాగ్నెట్స్ గ్లోబల్ సప్లయ్లో 90శాతం కంట్రోల్ చేస్తుంది. చైనా ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఏడు రేర్ ఎర్త్ మెటల్స్ (సమేరియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేషియం, స్కాండియం, యిట్రియం), వీటి సంబంధిత మాగ్నెట్స్ ఎగుమతులకు స్పెషల్ లైసెన్స్లు తప్పనిసరి చేసింది. ఎలక్ట్రిక్ మోటార్స్, బ్రేకింగ్ సిస్టమ్స్, స్మార్ట్ఫోన్స్ తయారీ, మిస్సైల్ టెక్నాలజీలో ఈ ఏడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలకం.
ఆగిన సుజుకీ ప్రొడక్షన్
జపాన్లో సుజుకీ మోటార్ ఇప్పటికే తన స్విఫ్ట్ కారు ప్రొడక్షన్ను చైనా ఆంక్షల వల్ల నిలిపేసింది. ‘‘భారత ప్రభుత్వం ఇచ్చే ఒక ఎండ్ -యూజర్ (ఎవరికి అమ్మారు) సర్టిఫికేట్ను చైనా అప్రూవ్ చేస్తేనే, చైనీస్ వెండర్లు ఈ మాగ్నెట్స్ను ఎగుమతి చేస్తారు. ఈ అంశంపై ఇండస్ట్రీ ప్రభుత్వంతో చర్చిస్తోంది” అని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ భాటియా గత వారం పేర్కొన్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ కొరతతో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు) ఎక్కువగా నష్టపోతాయని డెలాయిట్ ఇండియా పార్టనర్ రాజత్ మహాజన్ అన్నారు. ఇవి ఎలక్ట్రిక్ మోటార్లో కీలకమైనవని పేర్కొన్నారు. “రేర్ ఎర్త్ మాగ్నెట్స్కు బదులు వేరే మెటీరియల్స్ను వాడేందుకు రీసెర్చ్ జరుగుతోంది. కానీ ఇప్పటివరకు ఏ ఇతర మెటీరియల్స్ను పెద్ద మొత్తంలో కమర్షియల్గా వాడలేదు. రేర్ ఎర్త్ మాగ్నైట్స్తో ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేయొచ్చు. హై టెంపరేచర్లో పనిచేయగలవు” అని వివరించారు.
రీసైక్లింగ్ కూడా ఈవీ వాల్యూమ్స్కు సరిపోయేంత లేదని, కంపెనీలు పవర్ట్రెయిన్ లేదా ఆల్టర్నేట్ మెటీరియల్స్కు సడన్గా మారడం ఈజీ కాదని అన్నారు. “డిప్లమాటిక్ ఛానెల్స్ ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. లేదంటే వెహికల్స్ తయారీ కంపెనీలు పవర్ట్రెయిన్స్కు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది” అని అభిప్రాయపడ్డారు. ఇక్రా సీనియర్ వైస్ప్రెసిడెంట్ శ్రీకుమార్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ను ఈవీలలో ఎలక్ట్రిక్ మోటార్స్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్స్, పవర్ స్టీరింగ్ వంటి చాలా విడిభాగాల్లో వాడతారన్నారు. చైనా 90 శాతం సప్లయ్ను కంట్రోల్ చేస్తోంది కాబట్టి, ఈ ఆంక్షల వల్ల ఇండియా ఈవీ ఇండస్ట్రీ ఎక్కువగా నష్టపోతుందని పేర్కొన్నారు. కాగా, కేవలం ఇండియాకు మాత్రమే కాదు, ఇతర దేశాలకు జరిగే వీటి ఎగుమతులపై కూడా చైనా రిస్ట్రిక్షన్లు పెట్టింది.