చంపేసి ఉంటే.. పిడికెడు మట్టి అయినా ఇవ్వండయ్యా: సాయికృష్ణ తల్లి కన్నీటి ఆవేదన

చంపేసి ఉంటే.. పిడికెడు మట్టి అయినా ఇవ్వండయ్యా: సాయికృష్ణ తల్లి కన్నీటి ఆవేదన

విజయవాడ సిటీలో 23 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయికృష్ణను సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ టీం కొట్టి చంపేసిందని.. పోలీస్ స్టేషన్ లో చంపేసిన తర్వాత సాయికృష్ణ డెడ్ బాడీని కాల్చి బూడిద చేశారంటూ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు.

సాయికృష్ణ చనిపోయాడని.. ఇదిగో సాక్ష్యం అంటూ అంబటి రాంబాబు బయట పెట్టిన ఫొటోలు ఇప్పుడు కేసును ఉద్రిక్తంగా మార్చాయి. పోలీస్ కస్టడీలో చనిపోతే డెడ్ బాడీ అయినా ఇవ్వాలి కదా.. అలా కాకుండా శవాన్ని ఎలా మాయం చేస్తారు అనే ప్రశ్నలతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఈ పరిణామాల క్రమంలో గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, అతని బంధువులు మీడియా ముందుకు వచ్చారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ బతికి ఉంటే చూపించండి.. చంపేసి ఉంటే కనీసం ఎక్కడ దహనం చేశారో చెప్పండి.. ఏదో తేదీన చంపారో చెప్పండి.. కనీసం పిడికిలి మట్టి అయినా ఇవ్వండి అంటూ మీడియా ఎదుట కన్నీళ్లతో వేడుకున్న మాటలు అందర్నీ కన్నీటి పర్యంతం చేస్తున్నాయి.. 

మార్కాపురంలో సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. దీనికి సాక్ష్యాలు ఉన్నాయని.. కేసులు ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి.. అంతేకానీ ఇలా చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు సాయికృష్ణ బంధువులు. సాయికృష్ణను పోలీసులు చంపకపోతే కులం పేరుతో రాజీకి రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

దేశంలోనే ఇలాంటి ఘోరం ఎక్కడా జరగలేదని.. సాయికృష్ణను పోలీసులు కొట్టి చంపి.. ఆ తర్వాత శ్మశానంలో కాల్చి బూడిద చేశారని.. ఆ బూడిద కూడా లేకుండా చేశారని.. దీనిపై మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని.. దీనిపై పోలీసులు ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు సాయికృష్ణ బంధువులు. 

ALSO READ : తిరుమల కొండపై హెలికాప్టర్ కలకలం..

సాయికృష్ణను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారని.. బతికి ఉంటే అంత సమయం తీసుకోవాల్సి అవసరం ఏంటని ప్రశ్నిస్తున్న సాయికృష్ణ బంధువులు.. దీనిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని.. ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని.. ఎందుకు స్పందించటం లేదని నిలదీస్తున్నారు. 

ఇదే సమయంలో సాయికృష్ణ తల్లి మాట్లాడుతూ.. నా కుమారుడిని చంపి దహనం చేసి ఉంటే.. కనీసం  ఎక్కడ చేశారో అదయినా చెప్పాలని.. పిడికిలి మట్టి అయినా ఇస్తే.. అందులో నా కొడుకు చూసుకుంటానంటూ దండం పెట్టి వేడుకోవటం అందర్నీ కలిచి వేస్తుంది.

23 ఏళ్ల నా కొడుకు సాయికృష్ణపై ఎన్నో కేసులు ఉన్నాయని.. రౌడీ, స్మగ్లర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇదంతా తప్పని స్పష్టం చేశారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదని.. నా కొడుకు ఏమయ్యాడో చెబితే చాలని.. మా బతుకు మేం బతుకుతాం అంటూ కన్నీటితో వేడుకున్నారామె. 

ఏపీలో గాదె సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు ఏపీని కుదిపేస్తుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తుంది. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై క్లారిటీ రావాలంటే జూన్ 29వ తేదీన హైకోర్టులో విచారణ సమయంలో పోలీసులు ఏం చెప్పబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు బయటపెట్టిన సాయికృష్ణ డెడ్ బాడీ ఫొటోలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది అనేది ఆసక్తిగా మారింది.