న్యూఢిల్లీ: పొరుగు దేశాలకు అభివృద్ధి సాయం చేయడంలో ఎలాంటి షరతులు లేకుండా వారి ప్రాధాన్యతలకు ఆనుగుణంగా హెల్ప్ చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గురువారం మోడీతోపాటు మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్ కలసి పోర్ట్ లూయిస్లో సుప్రీం కోర్టు బిల్డింగ్ను ప్రారంభించారు. డెవలప్మెంట్ విషయంలో మానవ కేంద్రంగా ఇండియా భాగస్వామ్యాలు ఉంటాయని మోడీ స్పష్టం చేశారు. గౌరవం, వైవిధ్యత, భవిష్యత్పై శ్రద్ధ, సుస్థిర అభివృద్ధి విధానలతో ముందుకెళ్తామని వర్చువల్ ఇనాగరేషన్ సెర్మనీలో మోడీ చెప్పారు.
‘అభివృద్ధి సహకారంలో భాగస్వాములు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడమే ఇండియా ప్రాథమిక సూత్రం. అభివృద్ధి పాఠాలను పంచుకోవడమే మా ఏకైక ప్రేరణ. అందుకే మా డెవలప్మెంట్ కోపరేషన్లో ఎలాంటి నిబంధనలు ఉండవు. దీంట్లో ఎలాంటి రాజకీయ, ఆర్థికంగా పరిగణనలు ఉండవు’ అని మోడీ పేర్కొన్నారు. ఈ రీజియన్ (ఇండియన్ ఓషియన్ రీజియన్)లో తమ ప్రభుత్వ విజన్ అయిన సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియనన్ (సాగర్) గురించి మోడీ పలు విషయాలు వెల్లడించారు. మా డెవలప్మెంట్ పార్ట్నర్షిప్స్ మా భాగస్వామ్య దేశాల డెవలప్మెంట్ ప్రయారిటీస్కు అద్దం పట్టతాయని వివరించారు.
