
లండన్: ఓవైపు సిరీస్ను డ్రా చేసుకోవాలన్నా కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో ఇండియా.. మరోవైపు కీలక ప్లేయర్లు లేకుండా ఇంగ్లండ్.. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్ట్కు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి జరిగే ఈ మ్యాచ్లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2–1 ఆధిక్యంలో ఉంది. దాంతో ఆఖరి మ్యాచ్ను డ్రాగా ముగించైనా సిరీస్ను గెలవాలనే పట్టుదలతో ఇంగ్లిష్ జట్టు ఉండగా, విజయంతో సిరీస్ను పంచుకోవాలనే టార్గెట్తో టీమిండియా ముందుకొస్తోంది. సీనియర్ల రిటైర్మెంట్తో సంధి దశలో ఇంగ్లండ్ టూర్ను మొదలుపెట్టిన ఇండియా ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో ఆకట్టుకుంది. నాలుగో టెస్ట్లో బ్యాటర్ల పోరాట పటిమతో సిరీస్ చేజారకుండా చూసుకుంది. దీంతో ఇదే ఫామ్ను ఓవల్లోనూ కొనసాగించి ఇంగ్లండ్కు బలంగా ఆఖరి పంచ్ ఇవ్వాలని యోచిస్తోంది.
అర్ష్దీప్ అరంగేట్రం..!
ఈ మ్యాచ్ తుది జట్టుపై టీమిండియా భారీగా కసరత్తులు చేస్తోంది. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్లో వీరోచిత సెంచరీలతో ఆదుకున్న సుందర్, జడేజాకు లైనప్లో ప్రమోషన్ ఇవ్వనున్నారు. వీళ్లిద్దరు టాప్–6లో బ్యాటింగ్కు రానున్నారు. ఇక గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్లేస్లో ధ్రువ్ జురెల్ కన్ఫామ్ అయ్యాడు. అతన్ని ఏడో నంబర్లో ఆడించాలని భావిస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ను ఎనిమిదో నంబర్ బ్యాటర్గా తీసుకోనున్నారు. ఇక స్పీడ్స్టర్ బుమ్రా ఈ మ్యాచ్లో ఆడటం డౌట్గా ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అతనికి రెస్ట్ ఇస్తేనే బాగుంటుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అతని ప్లేస్లో ఆకాశ్ దీప్ తుది జట్టులోకి రావొచ్చు. మహ్మద్ సిరాజ్ పేస్ దాడికి నాయకత్వం వహిస్తాడు. మూడో పేసర్గా అర్ష్దీప్ సింగ్ అరంగేట్రం చేయొచ్చు. పిచ్ను బట్టి ప్రసిధ్ కృష్ణకు చాన్స్ ఇస్తారేమో చూడాలి. సర్రేతో ఇక్కడ ఆడిన చివరి మ్యాచ్లో 800 రన్స్ నమోదయ్యాయి. కాబట్టి మ్యాచ్ టైమ్కు పిచ్ను పరిశీలించి తుది జట్టును ఎంపిక చేయనున్నారు. బ్యాటింగ్లో కెప్టెన్ గిల్, జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్ మరోసారి కీలకం కానున్నారు.
స్టోక్స్ లేకపోవడం దెబ్బే..
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ఒక్క రోజు ముందుగానే తుది జట్టును ప్రకటించింది. గత నాలుగు టెస్ట్ల్లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని ప్లేస్లో ఒలీ పోప్ టీమ్ను నడిపించనున్నాడు. ఇప్పటి వరకు 140 ఓవర్లు వేసిన స్టోక్స్ 17 వికెట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. బ్యాటింగ్లో ఏడు ఇన్నింగ్స్ల్లో కలిపి 304 రన్స్ చేశాడు. ఇలాంటి సూపర్ ఫామ్లో ఉన్న స్టోక్స్ ఈ మ్యాచ్కు లేకపోవడం ఇంగ్లండ్కు మైనస్గానే చెప్పొచ్చు. ఒలీ పోప్ స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ మొత్తం నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది.
స్టోక్స్తో పాటు ఆల్రౌండర్ లియామ్ డాసన్, పేసర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ ఈ మ్యాచ్లో ఆడటం లేదు. వీళ్ల స్థానంలో జాకబ్ బెథెల్, అట్కిన్సన్, జెమీ ఓవర్టన్, జోష్ టంగ్ తుది జట్టులోకి వచ్చారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. క్రిస్ వోక్స్ నిలకడగా బౌలింగ్ చేస్తుండటం కలిసొచ్చే అంశం. భారీ హిట్టర్ బీథెల్ను తీసుకోవడంతో బజ్బాల్ స్ట్రాటజీతోనే ముందుకెళ్తామని ఇంగ్లండ్ మరోసారి సంకేతాలిచ్చింది. బ్యాటింగ్లో క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్పై భారం ఉంది.
తుది జట్లు
ఇండియా (అంచనా): శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్ / కుల్దీప్ యాదవ్/ అర్ష్దీప్ సింగ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్.
పిచ్, వాతావరణం
ఓవల్ గ్రౌండ్లో జరిగిన 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ ఎంచుకున్నాయి. పిచ్పై పచ్చిక కనిపిస్తున్న నేపథ్యంలో బౌలింగ్కు మొగ్గుక కనిపిస్తోంది. గురువారం మధ్యాహ్నం చిరుజల్లులు పడే చాన్స్ ఉంది. చివరి రెండు రోజుల్లోనూ వర్ష సూచన ఉంది.