
న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్ కేసులు కలవర పెడుతున్నాయి. కేరళలో కొత్త కేసు నమోదు కాగా, ఢిల్లీలోనూ ఓ ఫారినర్కు మంకీపాక్స్ వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఢిల్లీలోనే మూడుకు పెరగగా.. కేరళలో ఐదుకు చేరుకున్నాయి. జులై 27న యూఏఈ నుంచి కోజికోడ్ ఎయిర్పోర్టుకు వచ్చిన 30 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ కన్ఫామ్ అయిందని కేరళ మంత్రి వీణా జార్జ్ మంగళవారం వెల్లడించారు.
ఆ యువకుడు మలప్పురంలోని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నాడని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. మంకీపాక్స్తో త్రిస్సూర్ జిల్లా ఆస్పత్రిలో చనిపోయిన 22 ఏండ్ల వ్యక్తి కాంటాక్ట్స్ ట్రేస్ చేశామని, 20 మందిని ఐసోలేషన్లో ఉంచామని చెప్పారు. మరోవైపు, ఢిల్లీలో ఉంటున్న 35 ఏండ్ల ఆఫ్రికన్కు మంకీపాక్స్ వైరస్ పాజిటివ్ వచ్చిందని, ఈ మధ్యకాలంలోట్రావెల్ చేయలేదని అధికారులు తెలిపారు.