- ఇయ్యాల ‘సేవ్ సింగరేణి’ పేరిట గోలేటి నుంచి కొత్తగూడెం వరకు జాతా
- 14 రోజుల పాటు ఆందోళనలు
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ జంగ్సైరన్ మోగించేందుకు సిద్ధమవుతోంది. 14 రోజుల పాటు నిర్వహించే ఆందోళనలో భాగంగా మంగళవారం బొగ్గు గనులపై సింగరేణి యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టింది. తర్వాత సేవ్ సింగరేణి బస్సు యాత్ర, సింగరేణి మెయిన్ఆఫీస్ ఎదుట ధర్నా, అనంతరం ఇతర సంఘాలను కలుపుకొని సమ్మె తదితర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనుంది.
ఏప్రిల్లో సైతం మరో సమ్మె జరిగే అవకాశాలు ఉన్నాయి. -డైరెక్టర్లు ముగ్గురు మారడంతో సంస్థపై పట్టు తగ్గి, బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని యూనియన్ ఆరోపిస్తోంది. స్ర్టక్చరల్ సమావేశంలో అంగీకరించిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్చేస్తోంది. మెడికల్అన్ఫిట్అయి శిక్షణ పూర్తి చేసుకున్న 300 మందికి పోస్టింగ్ ఇవ్వాలని కోరుతోంది. సింగరేణికి సర్కార్లోని పలు శాఖల నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల సంస్థలో కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉండడం, ఉద్యోగుల జీతాలకు ప్రతీ నెల బ్యాంకు నుంచి ఓవర్ డ్రాప్ట్ చేయాల్సి వస్తోందని యూనియన్ ఆరోపిస్తోంది.
నేటి నుంచి బస్సు యాత్ర..
బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గనిపై సింగరేణి జాత పేరుతో గోలేటీ నుంచి కొత్తగూడెం వరకు ఆరు జిల్లాల గుండా బస్సు యాత్ర ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. అన్ని ఏరియాల్లోని గనుల మీదుగా పర్యటించి ఈ నెల 30న కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టి అంతిమంగా ఏప్రిల్లో సమ్మె చేయాలని ఏఐటీయూసీ నిర్ణయించింది. సమ్మె సక్సెస్కోసం యూనియన్ శ్రేణులు గేట్మీటింగ్లు, పోస్టర్ల ఆవిష్కరణలతో ప్రచారం చేశారు.
యూనియన్ డిమాండ్లు ఇవే..
ఏసీబీ సాకుతో నిలిపివేసిన మెడికల్బోర్డు పునరుద్ధరణ,- సింగరేణిలో రాజకీయ జోక్యం నిలిపివేయడం, డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించడం, కార్మికులకు సొంతింటి పథకం అమలు, పెర్క్స్పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లింపు,- రూ.51వేల కోట్ల బకాయిలు చెల్లింపు,- పెండింగ్లో ఉన్న మారుపేర్లు సవరణ, విజిలెన్స్ కేసుల సమస్య, -గోలేటీ, మాదారం, ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి, తాడిచెర్ల ప్రాంతాల్లో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు, -డిస్మిస్ చేసిన కార్మికులకు మరో అవకాశం ఇవ్వడం, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు, కార్మికుల సంక్షేమం, సాధారణ మరణానికి రూ.25లక్షల ఎక్స్గ్రేషియా, సీనియర్ మైనింగ్ సర్దార్లకు ఓవర్మెన్గా ప్రమోషన్లు, అన్ని క్యాడర్ స్కీంల సవరణ,- బొగ్గు గనుల్లో ఆధునిక రక్షణ పరికరాల ఏర్పాటు, క్లరికల్, పారామెడికల్, ఎస్అండ్పీసీ, పీఏఓ, ఎలక్ర్టిషియన్లు, ఫిట్టర్లు తదితర డిపార్ట్మెంట్లలో ఖాళీలను ఇంటర్నల్ఉద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్చేస్తున్నారు.
