- వచ్చే నెల 6న కువైట్తో చివరి మ్యాచ్
- 19 ఏళ్ల కెరీర్లో 94 గోల్స్
- యాక్టివ్ ప్లేయర్స్లో ఎక్కువ గోల్స్ చేసిన మూడో ప్లేయర్గా రికార్డు
న్యూఢిల్లీ : ఇండియా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి.. ఇంటర్నేషనల్ కెరీర్కు వీడ్కోలు ప్రకటించాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో భాగంగా వచ్చే నెల 6న కోల్కతా (సాల్ట్ లేక్ స్టేడియం)లో కువైట్తో జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరిదని గురువారం వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. 2005లో పాకిస్తాన్పై డెబ్యూ చేసిన ఛెత్రి ఇండియా తరఫున అత్యంత నిలకడగా, సుదీర్ఘకాలం ఆడిన ప్లేయర్గా ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. 19 ఏళ్ల కెరీర్లో 150 మ్యాచ్లు ఆడిన అతను 94 గోల్స్ చేశాడు. దీంతో ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్లు
అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇక ఇంటర్నేషనల్ కెరీర్లో యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో అత్యధిక గోల్స్ చేసిన మూడో ఫుట్బాలర్గా రికార్డులకెక్కాడు. క్రిస్టియానో రొనాల్డో (128), లియోనల్ మెస్సీ (106) ఛెత్రి కంటే ముందున్నారు. ఆల్టైమ్ లిస్ట్లో మాత్రం ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. రొనాల్డో, అలీ డేయ్ (ఇరాన్, 108), మెస్సీ టాప్–3లో ఉన్నారు. రిటైర్మెంట్ గురించి తన భార్య, తల్లికి చెప్పినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారని ఛెత్రి వెల్లడించాడు. ‘19 ఏళ్ల కెరీర్ చాలా జ్ఞాపకాలను మిగిల్చింది. బాధ్యతలు, ఒత్తిడి, విజయాలు, అపజయాలు, ఆనందం, భావోద్వేగాలు ఇలా ఎన్నింటినో అనుభవించా.
అసలు ఇన్నేళ్లు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తానని కలలో కూడా ఊహించలేదు. జాతీయ జట్టు కోసం చాలా శ్రమించా. కువైట్తో మ్యాచ్ను కూడా అంతే అంకితభావంతో ఆడాలనుకుంటున్నా. ఎందుకంటే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో ఇది మాకు చాలా కీలకం. గత నెలన్నర రోజులుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. ఏదో కొత్తగా అనిపిస్తోంది.
నా నిర్ణయం గురించి చెప్పినప్పుడు ఇంట్లో అందరూ బాధపడ్డారు. కానీ మా నాన్న కాస్త అర్థం చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇండియాకు ఆడేందుకు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టను. ఈ లైఫ్లో నేను చాలా అదృష్టవంతుడ్ని. నా కలను నిజం చేసుకోవడంలో సక్సెస్ అయ్యా’ అంటూ ఛెత్రి పేర్కొన్నాడు.
ఫుట్బాల్ సూపర్ మ్యాన్..
ఆగస్ట్ 3, 1984లో సికింద్రాబాద్లో జన్మించిన ఛెత్రి.. కోల్కతాతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పర్చుకున్నాడు. 5.7 అంగుళాల పొడవు ఉండే అతను కెరీర్ స్టార్టింగ్లో ఢిల్లీలోని ఓ లోకల్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించాడు. డ్యూరాండ్ కప్లో ఢిల్లీ క్లబ్ ఫెయిలైనా తాను మాత్రం ఆటలో ఓ మెట్టు ఎదిగాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2011లో బైచూంగ్ భూటియా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2012లో ఇండియా కెప్టెన్సీ అందుకున్న ఛెత్రి సుదీర్ఘ కాలం పాటు సేవలందించాడు.
తన హయాంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. ఇందులో నెహ్రు కప్ (2007, 2009, 2012), సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ చాంపియన్షిప్ (2011, 2015, 2021) చాలా ప్రధానమైనవి. 2008లో ఏఎఫ్సీ చాలెంజ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 27 ఏళ్ల తర్వాత 2011లో ఏఎఫ్సీ ఆసియా కప్కు టీమిండియా అర్హత సాధించింది. 2002లో మోహన్ బగాన్ తరఫున ప్రొఫెషనల్ ఫుట్బాల్ కెరీర్ను మొదలుపెట్టిన ఛెత్రి టీమిండియాకు సూపర్ స్ట్రయికర్గా మారాడు. 2010లో యూఎస్ఏలో మేజర్ లీగ్ సాకర్ టీమ్ అయిన కాన్సాస్ సిటీ విజర్డ్కు ఆడాడు.
2012లో పోర్చుగీస్ ఫుట్బాల్ లీగ్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. ఏడుసార్లు ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సాధించిన ఛెత్రి.. ఇండియాలో ఉండే మేజర్ క్లబ్స్ ఈస్ట్ బెంగాల్ (2008–2009), డెంపో (2009–10), ఇండియన్ సూపర్ లీగ్లో ముంబై సిటీ ఎఫ్సీ (2015–16), బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐ–లీగ్ (2014, 2013), ఐఎస్ఎల్ (2019), సూపర్ కప్ (2018)లోనూ ఆడాడు.
