- రాబోయే 2 ఏళ్లలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న 71 శాతం మంది
- లగ్జరీ ప్రాజెక్ట్లకు పెరుగుతున్న గిరాకీ
- వెల్లడించిన ఇండియా సోత్బే రిపోర్ట్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడంపై ధనవంతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఓ రిపోర్ట్ ప్రకారం, సుమారు 71 శాతం మంది రానున్న 12 నుంచి 24 నెలల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. దేశ ప్రాపర్టీ మార్కెట్పై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరుగుతోందని ఇండియా సోత్బే ఇంటర్నేషనల్ రియల్టీ (ఐఎస్ఐఆర్) యాన్యువల్ లగ్జరీ ఔట్లుక్ పేర్కొంది . ముఖ్యంగా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్ఐ) దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకంగా ఉన్నారు. 71 శాతం మంది ధనవంతులు దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకంగా ఉన్నారు. ఐఎస్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం, కిందటేడాది ఈ నెంబర్ 59 శాతంగా ఉంది. హోమ్ లోన్లపై వడ్డీకి సంబంధించి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని 56 శాతం మంది ధనవంతులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఈ ఏడాది నుంచే ఉండొచ్చని కూడా వీరు పేర్కొన్నారు. దీంతో మోర్టిగేజ్ మార్కెట్ పాజిటివ్గా ఉంటుందని పేర్కొన్నారు. మల్టిపుల్ లగ్జరీ ప్రాజెక్ట్లు ఉన్న 83 శాతం మంది ఇండియన్స్ నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేను ఐఎస్ఐఆర్ చేసింది. వీరిలో 34 శాతం మంది కమర్షియల్ రియల్ ఎస్టేట్లో, 25 శాతం మంది హాలిడేస్ హోమ్స్లో, 21 శాతం మంది అగ్రికల్చర్ ల్యాండ్లో, 20 శాతం మంది ఫార్మ్హౌస్లలో పెట్టుబడులు పెట్టారు. హాలిడేస్ హోమ్స్ కొన్నవారిలో 34 శాతం మంది గోవా బెస్ట్ డెస్టినేషన్ అని చెబుతున్నారు.
గల్ఫ్దేశాలపై ఆసక్తి
విదేశాల్లో చూస్తే దుబాయ్ యూఏఈ, యూఎస్ఏల్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సుమారు 12 శాతం మంది విదేశాల్లో ప్రాపర్టీలు కొనడానికి మొగ్గు చూపారు. ధనవంతుల్లో 43 శాతం మంది క్వాలిటీ ప్రాపర్టీల్లో ముఖ్యంగా రెంట్లు ఇచ్చే ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ‘ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతుండడంతో రికార్డ్ లెవెల్లో ఇండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కిందటేడాది రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇండ్ల సేల్స్ రికార్డ్ లెవెల్కు చేరుకోగా, స్టాక్ మార్కెట్ కూడా కొత్త గరిష్టాలను టచ్ చేసింది. రానున్న రెండేళ్లలో ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత దూసుకుపోతుందని అంచనా వేస్తున్నాం. గోల్డ్ మ్యాన్ శాక్స్ గ్రూప్ అంచనాల ప్రకారం, దేశంలో ధనవంతులు ఇంకో మూడేళ్లలో డబుల్ కానున్నారు. స్టార్టప్ల ఎకోసిస్టమ్ విస్తరిస్తుండడం, యూనికార్న్లు పెరుగుతుండడంతో మహా ధనవంతులు రోజు రోజుకి పెరుగుతున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు లాంగ్ టెర్మ్ కోసం రియల్ ఎస్టేట్ మార్కెట్ వైపు చూస్తున్నారు’ అని ఇండియా సోత్బే ఇంటర్నేషనల్ రియల్టీ ఎండీ అమిత్ గోయల్ పేర్కొన్నారు. ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని, మరింత విస్తరిస్తుందని ఈ సంస్థ సీఈఓ అశ్చిన్ చద్ధా పేర్కొన్నారు. కిందటేడాది భారీ సంఖ్యలో లగ్జరీ ప్రాజెక్ట్లు మొదలయ్యాయని చెప్పారు. మరింత సంపద సృష్టికి రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి ఆప్షన్ అనే ఆలోచన కూడా విస్తరిస్తోందని అన్నారు.