దేశం గొంతుకను గట్టిగా వినిపించారు.. అఖిలపక్ష బృందాలకు మోదీ కితాబు

దేశం గొంతుకను గట్టిగా వినిపించారు.. అఖిలపక్ష బృందాలకు మోదీ కితాబు
  • ప్రపంచానికి గొప్ప సందేశం పంపారు.. అఖిలపక్ష బృందాలకు మోదీ కితాబు 
  • ప్రధానిని కలిసి తమ అనుభవాలను వివరించిన ప్రతినిధులు

న్యూఢిల్లీ: భారత్ గొంతుకను ప్రపంచ దేశాలకు గట్టిగా వినిపించారని అఖిలపక్ష బృందాల ప్రతినిధులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. టెర్రరిజంపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టడంతో పాటు భారత్ అనుసరిస్తున్న విధానాన్ని వివరించడం ద్వారా ప్రంపచానికి గొప్ప సందేశం పంపారని కొనియాడారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష బృందాల ప్రతినిధులు మంగళవారం సాయంత్రం ఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్​లోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను  కలిశారు. తాము పర్యటించిన దేశాల్లో ఎదురైన అనుభవాలు, ఆయా దేశాల స్పందనను వారు ప్రధానికి వివరించారు.

భారత్ తరఫున ఆయా దేశాల్లో గళం వినిపించిన ప్రతినిధులను ప్రధాని మోదీ అభినందించారు. అఖిలపక్ష బృందాల ప్రతినిధులు మనందరికీ గర్వకారణమని మెచ్చుకుంటూ సమావేశం అనంతరం ప్రధాని ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇంతకుముందే అఖిలపక్ష ప్రతినిధులతో భేటీ అయ్యారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరి గురించి వీరంతా ఆయా దేశాలకు వివరించిన తీరు అద్భుతంగా ఉందని జైశంకర్ కొనియాడారు.    
 
7 బృందాలు.. 33 దేశాలు..
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ టెర్రరిజం గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మే 17వ తేదీన 7 అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. వీటిలో అధికార ఎన్డీయే కూటమి నుంచి నాలుగు (బీజేపీ 2, జేడీయూ 1, శివసేన1), ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి మూడు (కాంగ్రెస్, డీఎంకే, ఎన్ సీపీ ఎస్పీ నుంచి ఒక్కోటి) టీమ్ లు ఏర్పాటయ్యాయి.

రవి శంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పండా (బీజేపీ), సంజయ్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే (శివసేన), శశి థరూర్ (కాంగ్రెస్), సుప్రీయా సూలె (ఎన్ సీపీ-–ఎస్పీ), కనిమొళి (డీఎంకే) నేతృత్వంలోని ఈ బృందాల్లో మొత్తం 50 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో కొందరు మాజీ ఎంపీలు, మాజీ డిప్లమాట్స్ కూడా ఉన్నారు. ఈ ఏడు బృందాలు అమెరికా, యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏసియాలోని 33 దేశాల రాజధానుల్లో దాదాపు 10 రోజులపాటు పర్యటించి వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రులు గులాంనబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షిద్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆయా బృందాల్లో ప్రతినిధులుగా వెళ్లి వచ్చారు.