
- చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
- రూ.344 కోట్ల వడ్డీలేని రుణాలు
- 5,474 మందికి లోన్ బీమా చెక్కులు అందజేత
- నేటితో ముగియనున్న వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సంబురాల్లో పాల్గొంటూ వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తున్నారు. మహిళా సంఘాలు కొనుగోలు చేసిన బస్సులు, వివిధ వ్యాపారాల ప్రారంభిస్తున్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ఇందిరా మహిళా శక్తి సంబరాలు శుక్రవారంతో ముగియనున్నాయి.
కాగా, ప్రభుత్వం ఈ సారి మహిళా సంఘాలకు రూ.344 కోటు, గ్రామీణ మహిళా సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకు రూ.44 కోట్లు చెల్లించింది. ఏటా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు ప్రభుత్వమే రుణం సమకూర్చుతున్నది. మహిళల లోన్లకు సకాలంలో వడ్డీలు చెల్లిస్తున్నది. ప్రమాదబీమా, లోన్ బీమా వంటి స్కీంలను అమలు చేస్తున్నది. ప్రమాదవశాత్తు సభ్యురాలు మరణిస్తే ఆ కుంటుంబానికి రూ.10 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నది.
మహిళలు నష్టాలతో బ్యాంకు లోన్లు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, ఇతర మహిళలకు భారం కాకుండా ప్రభుత్వమే రూ.2 లక్షల వరకు లోన్ బీమా కడుతున్నది. ఇప్పటివరకు 410 మంది సభ్యులకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు చెల్లించగా.. లోన్ బీమా కింద 5,474 మంది సభ్యులకు రూ. 2 లక్షల వరకు అందజేసింది.
1.67 లక్షల మంది కొత్త సభ్యుల చేరిక..
రాష్ట్రంలో కొత్తగా 1.67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరారు. మహిళా సంఘాల్లో చేరే సభ్యుల వయసును సడలించారు. గతంలో 18 నుంచి 60 సంవత్సరాల వయసులో గల మహిళలకే అవకాశం ఉండేది. ఇప్పుడు 15–-65 ఏండ్ల మహిళలకు సంఘాల్లో చేరే అవకాశం లభించింది. దివ్యాంగ మహిళలకు ప్రత్యేక సంఘాలను ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
మహిళా స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం 64 లక్షల మందికి ఉండగా.. కోటి మందికి సభ్యత్వం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. కాగా, ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ఎమ్మెల్యలు తమ నియోజకవర్గాల్లో, మంత్రులు ఇన్చార్జ్గా ఉన్న జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారు.