
- జూన్ చివరి కల్లా ప్రతి సొసైటీ 50 శాతం చీరల ఉత్పత్తి పూర్తి చేయాలి
రాజన్నసిరిసిల్ల,వెలుగు: పంద్రాగస్టు కల్లా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని, సిరిసిల్ల నేతన్నలు జూన్ చివరి వరకు 50 శాతం ఉత్పత్తి పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి సిరిసిల్లలో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో మ్యాక్స్ సంఘాల సభ్యులు, ఆసాములతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఏడాదంతా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించిందన్నారు. చీరల ఉత్పత్తిని స్పీడప్ చేయాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్ చాలా పెద్దదని, ఏడాదికి 9 కోట్ల మీటర్ల బట్ట ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. ప్రతి సొసైటీకి కేటాయించిన లక్ష్యంలో 50 శాతం నెలాఖరులోగా పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత సొసైటీ ఆర్డర్ రద్దు చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం పెట్టిన బతుకమ్మ చీరలకు సంబంధించిన రూ.280 కోట్ల బకాయిలను చెల్లించామని తెలిపారు.
రూ.50 కోట్ల తో యారన్ బ్యాంక్ ఏర్పాటు చేశామని చెప్పారు. స్కూల్, అంగన్ వాడీ యూనిఫాం క్లాత్ ఆర్డర్ అందించామని, రాబోయే రోజుల్లో దేవాదాయ శాఖ నుంచి కూడా మరో ఆర్డర్ వస్తుందని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి ఆర్డర్ ద్వారా కార్మికులకు 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందని, మిగిలిన 4 నెలలు ఉపాధి కల్పించేందుకు ఆర్డర్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు పాల్గొన్నారు.